చర్చ ప్రారంభమైనట్లే: తెలంగాణ బిల్లుపై శ్రీధర్ బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఈ నెల 11వ తేదీన జరిగిన శాసనసభ సలహా సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాగానే సభలో ప్రవేశపెట్టాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇప్పుడు బిల్లు పెడితే వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు.
ఈ నెల 11వ తేదీన బిఎసి సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు, ఉప నేతలు పాల్గొన్నారని ఆయన చెప్పారు. నిబంధనల మేరకే ఓ రోజు సభా కార్యక్రమాలు జరిగాయని, దీన్ని రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నారు. స్పీకర్ను శాసనసభ్యులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.
సభా కార్యక్రమాల నిర్వహణలో భాగంగానే చర్చ ప్రారంభమైట్లని, ప్రతిపక్ష నేతను మాట్లాడాలని డిప్యూటీ స్పీకర్ అడిగారంటే ప్రారంభమైనట్లేనని ఆయన అన్నారు. ఆరోగ్యం బాగా లేదు కాబట్టే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు రాలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము అడిగినా స్పీకర్ బిఎసి సమావేశం పెట్టలేదని ఆయన అంటూ తాము ఇంకా ఎంత కాలం వేచి చూడాలని ఆయన అడిగారు. ఇప్పటికే తెలంగాణ కోసం సంవత్సరాలు వేచి చూశామని ఆయన అన్నారు.
తాము సభా సంప్రదాయాల ప్రకారమే నడుచుకుంటామని ఆయన చెప్పారు తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని అన్ని పార్టీలు చెప్పాయని, ఇప్పుడు అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును సభ ముందు పెట్టామని, చర్చ ప్రారంభించాలని కోరామని, చర్చను ప్రారంభమైందని ఆయన అన్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ ముసాయదా బిల్లుపై చర్చ ఎన్ని రోజులు జరగాలనేది బిఎసి నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.