అతడినొక్కడిని ఓడించండి: వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తక్కువ సమయమే మిగిలింది. అన్ని పార్టీ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే తరువాయి పార్టీలన్నీ హోరాహోరీగా తలపడటం ఖాయం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉండగా, జనసేన, బీజేపీని కలుపుకొని కూటమిగా వెళ్లి ఆ పార్టీని ఓడించాలనే కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఇచ్చాపురం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు అశోక్ బెందాళం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అశోక్ ను ఓడించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచి టీడీపీలోని మహామహులంతా ఓడిపోయినప్పటికీ జగన్ గాలిని ఎదుర్కొని అశోక్ విజేతగా నిలిచారు. అనంతరం వైసీపీలోకి రమ్మనమని ఆహ్వానం అందినప్పటికీ అతను తిరస్కరించారు. ఈసారి కూడా ఇక్కడి నుంచి టీడీపీ తరఫున అశోక్ పోటీచేస్తున్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్న అశోక్ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

ఇచ్చాపురం నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 1952లో కృషికార్ లోక్ పార్టీ తరఫున రెడ్డి నీలాద్రిరావు గెలుపొందారు. ఇదే పార్టీ తరఫున 55లో జరిగిన ఎన్నికల్లో ఉప్పాడ రంగబాబు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి కేవలం 1962, 1972,2004 ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. 1967లో స్వతంత్ర పార్టీ, 1978లో జనతాపార్టీ అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983 నుంచి 2019 వరకు 2004 మినహా ఎనిమిదిసార్లు టీడీపీ జెండా ఎగిరింది. బెందాళం అశోక్ వరుసగా 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నార్తు రామారావు మీద 25,278 ఓట్ల మెజారిటీతో, 2019 ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిరియ సాయిరాజ్ మీద 7145 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అశోక్ ను ఇక్కడ నిలువరించేందుకు వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు మాత్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications