మార్చి 19నుండి శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు.. ఎందుకంటే
శ్రీశైలం మల్లన్న మహా క్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు.
ఇటీవల శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నయనానందకరంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మరో ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.
నంద్యాల జిల్లాలో కొలువైన కోరి కొలిచే వారి కొంగు బంగారం శ్రీశైలం మల్లన్న మహా క్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. మార్చి నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా స్పర్శ దర్శనాన్ని నిలిపివేయనున్నట్టు వెల్లడించారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

ఇక ఈనెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్న ఆయన అదికూడా నిర్దిష్ట వేళలలో, నాలుగు విడతలలో కల్పిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి స్పర్శ దర్శనం టికెట్ ను 500 రూపాయలుగా నిర్ణయించామని, ఒక్కో విడతలో 1500 టికెట్లు మాత్రమే ఇస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్. లవన్న పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తారు .
తొలి రోజు ఉగాది ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టి శ్రీశైలం మల్లికార్జునుడికి విశేష సేవలు, అర్చనలు నిర్వహిస్తారు. ఇక మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలను ప్రారంభిస్తారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలను నిర్వహించి వీరాచార విన్యాసాలను, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించి అత్యంత ఘనంగా రథోత్సవాన్ని చేస్తారు.












Click it and Unblock the Notifications