ఎల్నినో కష్టాల వేళ బిగ్ రిలీఫ్, శ్రీశైలానికి భారీ వరద- నెక్స్ట్ ఇక.!!
ఎల్నినో కష్టాల వేళ బిగ్ రిలీఫ్. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సమయంలో కృష్ణానది మాత్రం జలకళను సంతరించుకుంటోంది. శ్రీశైలం జాలశయానికి భారీగా వరద చేరుతుంది. రాత్రి పది గంటల సమయంలో లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు చేసుకుంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. ఇదే స్థాయిలో నీటి ప్రవాహం మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులకు తీపి కబురు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,05,709 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 830.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 50.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు 1,09,519 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు విద్యుత్ ఉత్పతి జోరు పెంచారు. స్పిల్వే, పవర్ జనరేషన్ ద్వారా జూరాల నుంచి 1,05,141 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో వరద పెరుగుతుండడంతో రాయలసీమ కరువు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం ఒక్క పంటకైనా సాగునీరు వచ్చే అవకాశం ఉందని తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కాలువ ఆయకట్టు రైతులు భావిస్తున్నారు.

రైతులకు బిగ్ రిలీఫ్
కాగా, మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమ ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. జూరాలకు ఇన్ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరో వైపు తుంగభద్ర జలశయానికి నిలకడగా వరద కొనసాగుతోంది. గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు, సామర్థ్యం 105.788 టీఎంసీలకు గానూ 1,609.21 అడుగుల వద్ద 36.043 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 14,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం 3,80 క్యూసెక్కులు వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇక... శ్రీశైలం కు ఇదే స్థాయిలో నీటి ప్రవాహం మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని, తద్వారా జలాశయంలోకి అదనంగా సుమారు 25 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనాగా వెల్లడించారు.













Click it and Unblock the Notifications