ఏపీలో విషాదాన్ని మిగిల్చిన గాలివాన.. 7 మృతి, భారీగా పంట నష్టం
ఏపీలో అనూహ్యంగా వచ్చిన గాలివాన తీరని విషాదాన్ని మిగుల్చింది. ఆదివారం ఉదయం మొదలై రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వర్షం తోడయ్యి వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం చేసింది. సుమారు 50వేలకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా గాలుల తీవ్రతకు భారీవృక్షాలు సైతం నేలకొరిగాయి.
అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడి పలువురు మృతి చెందగా.. చెట్టు కూలిన ఘటనలో ఒకరు మరణించారు. అత్యధికంగా వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కాకినాడ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం అధికంగానే ఉన్నట్టు అధికారులు వివరించారు.

ఇక ఈ క్రమంలోనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ని ఆరా తీశారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
భారీ వర్షం నమోదైన టాప్ - 5 ప్రాంతాలు..
కాజులూరు - 100 మి.మీ
చొల్లంగిపేట - 94.5
కరప - 75.5
అమలాపురం - 65.5
పైడిమెట్ట - 65.5మి.మీ. వర్షపాతం నమోదైంది.
మృతి చెందిన వారి వివరాలు..
- తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగలో రైతు భాస్కర్(52), ఓజిలి మండలం గొల్లపాలెంలో కార్తీక్(11), చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో మునీంద్ర(30) మరణించారు.
- ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన గొర్రెల కాపరి నాగమల్లేశ్వరరావు(40)
- బాపట్ల జిల్లా చినగంజాంలో గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య(50) పిడుగు పడటంతో మృతిచెందారు.
- కృష్ణా జిల్లా శ్రీకాకుళం రేవు నుంచి ద్విచక్రవాహనంపై గాజులంక వెళ్తున్న సుప్రదీప్(23) పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
- పిడుగుపాటుకు గురై మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో రైతు సైదు గిరిబాబు(33) చనిపోయాడు.
- ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో చెట్టు పడటంతో పదేళ్ల బాలుడు మామిడి బాలగోవిందు అక్కడికక్కడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications