విచిత్రం:కోడిగుడ్డా...ప్లాస్టిక్ పొడా?...తేల్చేందుకు పరీక్షలు
అనంతపురం:నేటి కాలంలో మనిషి నిత్య జీవితం కల్తీలతో,నకిలీలతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఆలోచిస్తే బెంబేలెత్తాల్సిన పరిస్థితి...బ్రతకడం కోసం మనిషి తీసుకునే ఆహారపానియాలు ఈ కల్తీ,నకిలీల కారణంగా నాసిరకంగా మారడం అటుంచి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి.ఉదయాన్నే లేచింది మొదలు తాగే నీరు నుంచి...పాలు,పప్పు, ఉప్పు,నెయ్యి,నూనె, బియ్యం ఇలా అన్నీ ఇటు కల్తీనో అటు నకిలీనో ఏదో ఒక ప్రభావానికి గురవుతున్న పరిస్థితి.
అయితే ఈ క్రమంలో ఇటీవలే ప్లాస్లిక్ రైస్,ప్లాస్టిక్ కోడిగుడ్ల గురించి కూడా జోరుగా ప్రచారం జరిగినా అవి నిరూపణ కాలేదు. పైగా 5 రూపాయలకు దొరికే కోడిగుడ్డును ఎలా కల్తీ చేస్తారనే సందేహం కూడా ఎక్కువమందిలో ఉండేది...అయితే ఆ సందేహాన్ని మరోసారి తరచిచూడాల్సిన అవసరం వచ్చింది...కారణం ఏంటో ఈ వార్త చదివితే మీకే అర్థం అవుతుంది...
కోడిగుడ్డులో తెల్ల సొన ప్లాస్టిక్ పొడిగా మారినట్లు కనిపించడంతో ఖంగుతిన్న ఒక యువకుడు వైద్యుడ్ని సంప్రదించగా వారు కూడా ఆశ్చర్యపోయి ఆ పొడిని వైద్య పరీక్షలకు పంపడమే ఈ వార్తలోని ప్రధానాంశం...కర్ణాటకలోని బళ్లారి నగరంలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బళ్లారి నగరం సంగనకల్లు రహదారిలోని గాంధీనగర్ హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కోడిగుడ్లు కొనుగోలు చేశాడు. ఓ గుడ్డును ఆమ్లెట్ వేసే క్రమంలో అది చేతి నుంచి జారి కింద పడింది.
తెల్లసొన గచ్చు మీద కొంతమేరా విస్తరించడంతో ఆయన అందులో మధ్యలోని పచ్చ సొన వరకు సేకరించి ఆమ్లెట్ వేసుకున్నాడు. ఆ తరువాత కొంతసేపటికి గచ్చు శుభ్రం చేద్దామని చూసేసరికి ఆ తెల్ల సొన ప్లాస్టిక్ పొడి మాదిరిగా తయారై కనిపించడంతో అవాక్కయ్యాడు. దీంతో ఆందోళన చెందిన అతడు ఆ పొడిని, తాను కొనుగోలు చేసిన మిగిలిన గుడ్లను తీసుకొని జిల్లా ఆసుపత్రిలో ఉన్న సర్వేలెన్స్ అధికారి డా.అనిల్కుమార్ కు విషయం చెప్పి వాటిని అందచేశాడు.
ఆ తరువాత ఆయన సూచన మేరకు స్థానిక హెచ్.ఆర్.గవియప్ప కూడలి వద్ద ఉన్న పశువుల ఆసుపత్రికి వెళ్లి డైరెక్టర్ డా.శశిధర్కు చూపారు. ఆయన వీటి సంగతి నిగ్గు తేల్చేందుకు ఆ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. సమాచారం అందుకున్న ఆహార తనిఖీ అధికారులు కోడిగుడ్లు విక్రయించిన దుకాణాన్ని పరిశీలించారు. వాటిని ఎక్కడ నుంచి తెచ్చారు? ఎన్ని రోజులుగా నిల్వ ఉంచారు వంటి వివరాలు సేకరించారు.
ఈ గుడ్ల తాలూకు పరీక్షల రిపోర్టులు వస్తే గుడ్ల కల్తీకి సంబంధించి అతి ముఖ్యమైన విషయం బైటపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న సామాన్య జనం గుడ్ల వాడకంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆ పరీక్షల రిపోర్టుల వివరాలు తెలుసుకోవాలనుకునేవారి సంఖ్య అంతకంతకూ ఎక్కువైపోతోంది.