జగన్కు మరో షాక్: టీడీపీలో చేరనున్న సుజయకృష్ణ రంగారావు!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరగా.. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కూడా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే బుధవారం సుజయకృష్ణ రంగారావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నానని వెల్లడించిన ఆయన.. నేతల అభిప్రాయాలను కోరారు.
త్వరలోనే తాను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని ఆయన తెలిపినట్టు సమాచారం. తనతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారుతారని రంగారావు వెల్లడించారట.

కాగా, ఇప్పటికే 11 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి ఆ పార్టీని కష్టాల్లోకి నెట్టేయగా.. తాజా ఫిరాయింపుల వార్తలతో ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లినట్లయింది.
బుధవారం సాయంత్రం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయం ప్రకటించేందుకు సుజయకృష్ణ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసింది. కాగా, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటును గెలుచుకునే అవకాశాలూ అడుగంటుతున్నాయి.












Click it and Unblock the Notifications