చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారించిన సుప్రీంకోర్టు
Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదోపవాదాలను ఆలకించింది.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఇదివరకే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 53 రోజుల పాటు విచారణను ఎదుర్కొన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్పై రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు.

హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లింది. దీన్ని రద్దు చేయాలంటూ గత ఏడాది పిటీషన్లను దాఖలు చేసింది. ఆయా పిటీషన్లపై విచారణను వాయిదా వేస్తూ వస్తోంది సుప్రీంకోర్టు. ఈ ఉదయం మరోసారి విచారణ చేపట్టింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది.
ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తమ వాదనలను వినిపించారు. ఈ ఎన్నికల అనంతరం తామే అధికారంలోకి వస్తామని, ఈ కేసుతో ప్రమేయం ఉన్న అధికారులందరిపైనా కఠిన చర్యలను తీసుకుంటామంటూ తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు గురి చేస్తోందని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

స్కిల్ డెపలప్మెంట్ కుంభకోణం కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదంటూ హరీష్ సాల్వే వాదించారు. నిరాధారమైన ఆరోపణలను చంద్రబాబుపై మోపారని వివరించారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాతే ఏపీ హైకోర్టుకు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు.
అధికారులను చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారనడంలో అర్థం లేదని హరీష్ సాల్వే అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి వాదనలను విన్న అనంతరం విచారణను మరోసారి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. నాలుగు వారాల పాటు అంటే ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications