'సార్వత్రిక'పై 'స్థానిక' ప్రభావం: మే 7 తర్వాతే ఫలితాలు
న్యూఢిల్లీ: ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి వాటి ఫలితాలను మే 7వ తేదీ తర్వాతనే విడుదల చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని సుప్రీంను ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఈ రోజు తీర్పు చెప్పింది. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను ఏప్రిల్ 6న, 11వ తేదీని నిర్వహించేందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. అయితే, ఫలితాలు మాత్రం మే 7వ తేదీ తర్వాత విడుదల చేయాలని ఆదేశించింది.
కాగా, సార్వత్రిక ఎన్నికలు తొమ్మిది దఫాలుగా ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో వేరు వేరు తేదీల్లో... ఒకేరోజు లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో మే 7వ తేదీన లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. స్థానిక ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఫలితాలను మాత్రం 7వ తేదీ తర్వాత విడుదల చేయాలని ఆదేశించింది.