మూడు రాజధానుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!
ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ వినతితో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ మూడు రాజధానుల పై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. సుప్రీంలో ఉన్న కేసు త్వరగా విచారించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయ స్థానానికి లేఖ రాసింది. ఈ రోజు సుప్రీం కోర్టు ప్రారంభమైన తరువాత మరోసారి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముందుంచారు. దీంతో..కోర్టు తమ నిర్ణయానికి వెలువరించింది. ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో సుప్రీంలో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో నిర్ణయం తీసుకోవాలా లేదా అనే అంశం పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ నెల 23న విచారించాలని నిర్ణయించింది.

అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019, డిసెంబర్ 18న అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసారు. ఆ తరువాత అసెంబ్లీ దీనికి సంబంధించి బిల్లులను సభలో ప్రవేశ పెట్టింది. ఆమోదించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. ఈ నిర్ణయం పైన అమరావతి ప్రాంత రైతులు...జేఏసీ నేతలు హైకోర్టులో వరుస పిటీషన్లు దాఖలు చేసారు. వీటిని హైకోర్టు విచారించే సమయంలోనే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుంది. ఆ తరువాత హైకోర్లు అమరావతికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని మార్పుకు సంబంధించి చట్టం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని నిర్దేశించింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది.

విశాఖ నుంచి పాలనకు సిద్దమవుతున్న వేళ
ప్రభుత్వం దాఖలు చేసిన సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆరు నెలల్లోగా అమరావతి నిర్మాణం పై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కానీ, పూర్తి ఆదేశాల పైన మాత్రం విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. సుప్రీం నిర్ణయం మేరకు జనవరి 31న మూడు రాజధానుల పైన కేసు విచారణ చేయాల్సి ఉంది. కానీ, బెంచ్ సమావేశం కాకపోవటంతో వాయిదా పడింది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించే ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని..అక్కడి నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే, సీఎం విశాఖలో ఉండటానికి అభ్యంతరం లేకపోయినా.. కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో పాలన విశాఖ నుంచి చేయటం సాధ్యం కాదనే వాదనలు మొదలయ్యాయి. దీంతో..మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. మూడు రాజధానుల కేసును త్వరితగతిన విచారణ చేయాలని కోరింది.

ఈ నెల 23న సుప్రీంలో మూడు రాజధానుల కేసు
ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వినతి మేరకు సుప్రీం కోర్టు ఈ నెల 23న మూడు రాజధానుల కేసు విచారణకు స్వీకరించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా ఉంటుదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయంగానూ ఇప్పుడు సుప్రీం తీర్పు పైన ఆసక్తి కనిపిస్తోంది. హైకోర్టులో వచ్చిన తీర్పు మరసారి సుప్రీంకోర్టులోనూ వస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్ కు మాత్రమే ఏపీ రాజధాని మార్పు అధికారం ఉందని వాదిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ నెల 23న విచారణ తరువాత ఏం చెప్పబోతోంది.. రాజధానుల వివాదం పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications