అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
ఏపీ వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు మంగళవారం సుప్రీంకోర్టు సమక్షానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ సుప్రీంకోర్టు మీదే నిలిచింది. ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేది ఆసక్తి రేపుతోంది.
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన చేపట్టనుంది. ఆ గడువు రానే వచ్చింది. మరోసారి ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది.
మరోసారి విచారణకు..
ఆయా పిటీషన్లన్నీ మంగళవారం సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన విచారణను కొనసాగించనుంది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. గతంలో చేపట్టిన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వికేంద్రీకరణకు..
అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరమని అభిప్రాయపడ్డారు.
రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని నిర్ధారించడానికి న్యాయస్థానాలేమీ టౌన్ ప్లానింగ్ ఆఫీసులు కావంటూ జస్టిస్ బీవీ నాగరత్న ఘాటుగా వ్యాఖ్యానించారు అప్పట్లో. ఒక రాజధాని నగరాన్ని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందా? అంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు.
మధ్యంతర స్టే..
ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టేను ఇచ్చారు న్యాయమూర్తులు. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా రేపు ఈ పిటీషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. కాగా ఇదే అంశంపై ఇటీవలే మరో పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి దీన్ని దాఖలు చేశారు.
మరో పిటీషన్..
ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధాని నగరాన్ని నిర్దారించడానికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ఒకేచోట రాజధాని నగరం సరైంది కాదంటూ కమిటీ సిఫారసు చేసింది.
అందరి దృష్టీ..
రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీ సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నగరం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించినప్పటికీ- పెడచెవిన పెట్టింది. అక్కడే అమరావతిని ప్రకటించింది. ఇప్పటికే దాఖలైన పిటీషన్లతో కలిపి దీన్ని కూడా విచారణకు చేపట్టనున్నారు న్యాయమూర్తులు. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అందరి దృష్టీ సుప్రీంకోర్టు మీదే నిలిచింది.