ఎపిలో ఒకలా, టీలో మరోలా: చంద్రబాబుపై సురవరం వ్యాఖ్య
విజయవాడ: కమ్యూనిస్టుల పునరేకీకరణకు సమయం ఆసన్నమైందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం నాడు విజయవాడ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వామపక్షాలు కలిసి పనిచేయాలని భావిస్తున్నామన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ముఖ్యమంత్రులు ఒకే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని సురవరం కెసిఆర్, చంద్రబాబులను ఉద్దేశించి ఆరోపణ చేశారు. చంద్రబాబు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఎన్నో మాటలతో ప్రజలను ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ-3లా పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మే 14న ఆందోళనలు చేపడతామన్నారు.
అడవులను ధ్వంసం చేసింది గత ప్రభుత్వాలేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గిరిజనులను అడవుల నుంచి తరిమేసేందుకు అటవీహక్కుల చట్టాలు తెస్తున్నారన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వారికి వామపక్షాలు అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.