తెలంగాణ నోట్పై షిండే సైన్: సోనియా పచ్చజెండా
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్పై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేశారు. మంత్రివర్గం ముందు పెట్టడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పచ్చజెండా ఊపారు. నోట్ ప్రతులను కేంద్ర మంత్రులకు కూడా అందజేశారు. మంత్రి వర్గం ముందుకు తెలంగాణ నోట్ వస్తుందనే వార్తలను సుశీల్ కుమార్ షిండే కొట్టేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ నోట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ అభిప్రాయాన్ని మాత్రమే కోరాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 22 పేజీలతో ఆ నోట్ తయారైనట్లు గురువారం ఉదయం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ నోట్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందనే వార్తలను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయం కొట్టిపారేశారు. తెలంగాణ నోట్పై మంత్రివర్గంలో చర్చ జరుగుతుందనే వార్తలు ఊహాగానాలేనని ఆయన అన్నారు.
ఎకె ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఆయన చెప్పారు. కేబినెట్ నోట్, మంత్రివర్గంలో చర్చపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. నోట్ సిద్ధమైన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే అది యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ వద్దకు వెళ్లలేదని, దానిపై తాను సంతకం చేయలేదని ఆయన చెప్పారు. ఈ మాటలు చెప్పిన కొద్ది గంటల్లోపే తెలంగాణ నోట్పై గురువారం ఉదయం వచ్చిన వార్తలను ధ్రువీకరిస్తూ వార్తలు వచ్చాయి.