ఉద్దేశ్యం అది కాదు: స్వామిగౌడ్, కుప్పంలో లోకేష్కు షాక్, నిలదీత
హైదరాబాద్: హిందువులు నలుగురు చొప్పున పిల్లల్ని కనాలన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తన వ్యాఖ్యల పైన మంగళవారం వివరణ ఇచ్చారు. తన మాటల ఉద్దేశ్యం అధి కాదన్నారు. కన్నబిడ్డలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారని, ఆ బాధతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.
కాగా, ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్న విషయం తెలిసిందే. లేనిపక్షంలో హిందు జాతి తగ్గిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కౌండిన్య సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మంజుల అనగానికి ఆదివారం రాత్రి బషీర్బాగ్ దేశోద్ధారకభవన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అనే అందమైన నినాదంతో హిందూ జాతి తగ్గిపోయే ప్రమాదముందన్నారు. ఒకరు పది మంది సంతానం కంటుంటే, మరొకర్ని ఇద్దరికే పరిమితం చేయాలని కోరడం ఏం పద్ధతని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్రను తొక్కిపెట్టారని.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర దీనికి నిదర్శనమని చెప్పారు. జ్యోతిరావు పూలే హిందూ మతంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
నారా లోకేష్కు చుక్కెదురు!
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్కు కుప్పంలో చుక్కెదురైంది! లోకేష్ మంగళవారం కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కొందరు అక్కడకు వచ్చి రుణమాఫీపై ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హామీ లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు చాలామందికి రుణమాఫీ జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో లోకేష్ కొంత ఇబ్బంది పడ్డారట. బ్యాంకర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.