కేసీఆర్ దేశమంతా తిరిగి మోడీని కలవడమేమిటి, బ్రీఫింగ్ కోసమా: బాబు, హడావుడి: లక్ష్మణ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసం 7 లోకకళ్యాణ్ మార్గ్ వద్దలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ ఢిల్లీకి వచ్చారు. ప్రధానిని కలిశారు.
కేసీఆర్ మూడు రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం నిప్పులు చెరిగారు. కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్ పేరిట హడావుడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
సార్వత్రిక ఎన్నికల్లో మోడీకే ప్రజల ఓటు
కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి కనీసం రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో తిరగడం సరికాదని డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ల జాబితాపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్థారించారో స్పష్టం చేయాలన్నారు. బీసీల రిజర్వేషన్ల శాతాన్ని కుదించడం అన్యాయమన్నారు. ఈ అంశంపై టీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోడీకే ఓటు వేస్తారని చెప్పారు.
బ్రీఫింగ్ కోసం కలుస్తున్నారా?
కేసీఆర్, మోడీ భేటీపై అంతకుముందే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగి, ఇప్పుడు మోడీని కలవడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగి ఇప్పుడు ప్రధానిని కలవడం ఏమిటన్నారు. బీజేపీ, కేసీఆర్ చర్యలే వాళ్ల ఉద్దేశాలను బయటపెడుతున్నాయన్నారు. ఇప్పుడు ప్రధానిని కేసీఆర్ కలుస్తోంది.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమా? లేక బ్రీఫింగ్ కోసమా? అని సెటైర్ వేశారు.
వివిధ అంశాలపై చర్చ
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలను కేసీఆర్ ఇటీవలి వరకు కలిశారు. అనంతరం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఎవరినీ కలవలేదు. బుధవారం ప్రధానమంత్రితో భేటీలో ప్రస్తావించే అంశాలపై అంతకుముందే అధికారులతో చర్చించి కసరత్తు చేశారు. విభజన చట్టంలోని పెండింగులో ఉన్న పలు అంశాలపై ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి చర్చించారని తెలుస్తోంది. వెనుకబడిన పది జిల్లాలకు నిధులు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, తెలంగాణలోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయం, కరీంనగర్ జిల్లాలో ఐఐఐటీ తదితర అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
రెండోసారి సీఎం అయ్యాక తొలిసారి
కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ మేరకు ప్రధానితో కేసీఆర్ భేటీకి సంబంధించిన అంశానికి సంబంధించి తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు పేర్కొన్నారు.