ఫైలిన్ తుఫాను: ఒకే వేదికపై టి, సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన ప్రకటన అనంతరం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఒకే వేదిక పైకి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇరు ప్రాంతాల మంత్రులు ఒకే వేదిక పైన శనివారం కూర్చున్నారు. జూలై 30వ తేదిన సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటన వెలువడినప్పటి నుండి మంత్రులు ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవనే చెప్పవచ్చు.
కేవలం రాష్ట్ర మంత్రవర్గ సమావేశానికి మాత్రమే ఇరు ప్రాంతాల వారు హాజరయ్యారు. ఇప్పుడు ఫైలిన్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
దీనికి పలువురు మంత్రులను, అధికారులను ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు జానా రెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీమాంధ్రకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, టిజి వెంకటేష్, మహీధర్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ భేటీలో వారు ఫైలిన్ తుఫాను పైనే చర్చించారు. మంత్రులు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులు ఒకే వేదికపై ఉండటం ఆసక్తిగా మారింది.