లక్షల్లో జీతాలు తీసుకుంటారు.. అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రాలేరా?
లక్షల్లో జీతం పుచ్చుకుంటున్న ఎమ్మెల్యేలు.. తమ లక్ష్యాన్ని మర్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమరావతి: లక్షల్లో జీతం పుచ్చుకుంటున్న ఎమ్మెల్యేలు.. తమ లక్ష్యాన్ని మర్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి తగు పరిష్కారాలు కొనుగొనాల్సి ఉండగా, చాలామంది ఎమ్మెల్యేలు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిర్ణయంతో ఈసారి ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మరోవైపు అధికార పార్టీ సభ్యులు కూడా ఏదో ఒక కారణం చెప్పి తరచూ అసెంబ్లీకి గైర్హాజరు అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు అసెంబ్లీ సమావేశాలు జరిపేది ఎందుకు? ప్రజా సమస్యలు చర్చించడానికి. మరి ప్రజాప్రతినిధులు ఇలా గైర్హాజరు అవుతుంటే అసెంబ్లీ సమావేశాల లక్ష్యం నెరవేరుతుందా? లక్షల రూపాయలు జీతం తీసుకునే ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాలేరా? ఇది ప్రజల ప్రశ్న.

ప్రశ్నలు, సమాధానాలు అన్నీ వాళ్లవే...
నవంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ సభ్యులెవరూ హాజరుకాకూడదంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాల్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకావడం లేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు.. ఆ పార్టీ మంత్రులే సమాధానాలు ఇస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా...
అటు శాసనసభలోనూ. ఇటు శాసనమండలిలోనూ సుమారు వారం రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత సమావేశాలు వాయిదా పడ్డాయి. విచిత్రం ఏమిటంటే.. ఈ సమావేశాలకు తాము హాజరుకాలేమని, తమకు సెలవు కావాలని దాదాపు 100 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ ను కోరడం.

పెళ్లిళ్లకు హాజరుకావాలంటూ...
అదేమంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాహాలు ఉన్నాయని, తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితుల కుటుంబాల్లో జరిగే ఈ వివాహ శుభకార్యాలకు తాము తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుందని, కాబట్టి తమకు అనుమతి ఇవ్వాలని పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు.

ప్రారంభమైన తొలిరోజుల్లోనూ...
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అసలు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజుల్లో కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. అదేమంటే.. తాము అగ్రిటెక్ సదస్సుకు హాజరుకానున్నామని, అందుకే అసెంబ్లీకి రాలేకపోయామని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు...
ఎమ్మెల్యేల వినతికి స్పందించిన స్పీకర్ కోడెల వివాహ వేడుకలకు వెళ్లేందుకు అనుమతించారు. రెండ్రోజులు అసెంబ్లీని వాయిదా కూడా వేశారు. ఈ రెండ్రోజులను భర్తీ చేసేందుకు సమావేశాలను మరో రెండ్రోజులు పొడిగించాలని స్పీకర్ నిర్ణయించారు. వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్-30 నుంచి జరగనున్నాయి.












Click it and Unblock the Notifications