ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా?: టీడీపీ-బీజేపీపై తమ్మారెడ్డి ఆగ్రహం, ‘కేటీఆర్కు థ్యాంక్స్’
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు, కేటాయింపులు సక్రమంగానే జరిగాయంటూ బీజేపీ నేతలు గత కొద్ది రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రముఖ సినీ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా స్పందించారు.
జగన్ను 'బీకాంలో ఫిజిక్స్' జలీల్ ఖాన్తో ఎందుకు పోలుస్తున్నారు?: ఏం జరిగింది?
ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు అనడం, నిధులిచ్చామని బీజేపీ నేతలు చెబుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలల వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ఇప్పుడే.. బీజేపీ దుమ్మెత్తి పోవడం ఎందుకని ప్రశ్నించారు.
విడిపోయి కొట్టుకోండి
టీడీపీ నేతలు, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోతున్నారని తమ్మారెడ్డి అన్నారు. ‘‘నా ఆలోచన' ద్వారా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజలను తికమక పెట్టొద్దు. విడిపోయి కొట్టుకోండి' అని టీడీపీ, బీజేపీ నేతలపై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు పిచ్చోళ్లనుకుంటున్నారా?
‘రెండు(కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ) ప్రభుత్వాల్లో మీరే ఉంటారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు.. టీవీ ఛానెళ్లలో అల్లరి చేస్తారు.. పేపర్లలో అల్లరి చేస్తారు.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకపోతే జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా? మీరు(బీజేపీ-టీడీపీ) ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి.. నిజానిజాలు చెప్పండి.. అదే నా కోరిక' అని తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించారు.
కేటీఆర్కు కృతజ్ఞతలు
ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చర్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్కు యాంకర్ ప్రదీప్ ట్వీట్ చేయడం.. అందుకు, కేటీఆర్ సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ఈ విషయమై తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన' ద్వారా స్పందించారు. ‘వెంటనే స్పందించినందుకు కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే, నా విన్నపం ఏంటంటే.. ట్విట్టర్లో ఎవరో చెబితే స్పందించడం కాదు! అన్ని పాఠశాలల్లో చెక్ చేయించండి. పాఠశాలల్లో సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చాలా ఖర్చుపెట్టాయి. మిగతా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయమై గణాంకాలు తెప్పించుకుని చూస్తే బాగుంటుంది. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను' అని తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అనుమానాలు తలెత్తుతున్నాయి..
‘మోడీ గారి ప్రభుత్వం ‘శౌచాలయ్'కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, పాఠశాలల్లో ఈ సౌకర్యాలు ఇంకా ఎందుకు కల్పించలేదు? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగానే కృషి చేస్తున్నాయి. అయినా, యాంకర్ ప్రదీప్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సమస్య ప్రస్తావించే వరకు ఆ పాఠశాలలో సౌకర్యాల కల్పన ఎందుకు జరగలేదు? అంటే, పనులు జరిగినట్టు అకౌంట్స్లో చూపిస్తున్నారే తప్ప.. ఆ పనులు జరగట్లేదా? అనే అనుమానం తలెత్తుతోంది' అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా తమ్మారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.