జనసేనలోకి తమ్మినేని - తేల్చి చెప్పేసారు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు పెరిగాయి. ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. జనవరి మూడో వారం నుంచి జిల్లా పర్యటనలకు జగన్ సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం జనసేనలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, తన నిర్ణయం ఏంటో తమ్మినేని తేల్చి చెప్పారు.
ఏపీ ఎన్నికల్లో పరాజయం తరువాత వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం పార్టీ వీడారు. కొంత కాలంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన జనసేనలో చేరు తున్నారని శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హోరెత్తుతోంది. గతంలో తమ్మినేని ప్రజారాజ్యం లోనూ పని చేసారు. దీంతో, ఇప్పుడు జనసేనలో చేరుతున్నారని.. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీ నేతలతో చర్చలు చేస్తున్నారని చెబుతున్నారు. కాగా, తాజాగా మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ తో భేటీ వేళ తమ్మినేని కీలక అంశాలు వెల్లడించారు.

తాజాగా తమ్మినేనిని శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా జగన్ నియమించారు. అదే విధంగా సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాల వలసకు కొత్త ఇంఛార్జ్ గా చింతాడ రవి కుమార్ ను ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, తమ్మినేని పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన తమ్మినేని తాను జనసేనలోకి వెళ్తున్నాననే వార్తలను ఖండించారు. తాను జన సేన లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తన కుమారుడికి సర్జరీ కారణంగా తాను 15 రోజులుగా ఆస్పత్రి వద్దే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదని స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications