తారకరత్న ఆరోగ్యం విషమం- అక్కడే బాలయ్య : బెంగుళూరుకు చంద్రబాబు..!!
తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు నారాయణ హృదయాలయ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అందులో పూర్తిగా వెంటిలేటర్ సపోర్టుతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. కుప్పంలో లోకేష్ పాదయాత్ర కోసం వచ్చిన తారకరత్న కార్యక్రమంలోనే కుప్ప కూలిపోయారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండె పోటుకు గురైనట్లు గుర్తించారు. వెంటనే యాంజియోగ్రామ్ చేసారు. గుండెలోని ఎడవైపు బ్లాక్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటంతో స్టంట్ ఏర్పాటును వాయిదా వేసారు. బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యులు కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను పరిశీలించారు.
ప్రత్యేకంగా రెంబు అంబులెన్సుల్లో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ కు అర్ద్రరాత్రి వైద్యుల సాయంతో తరలించారు. అక్కడ తారకరత్నకు అన్ని పరీక్షలు చేసారు. బెలూన్ యాంజియోప్లాస్టీ చేసినట్లుగా కుప్పం వైద్యులు వెల్లడించారు. ఇక, బెంగుళూరు ఆస్పత్రిలో ప్రస్తుతం పూర్తిగా రెస్పిరేటరీ సపోర్టింగ్ సిస్టమ్ తో చికిత్స కొనసాగిస్తున్నారు. తారక రత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. వైద్య ప్రోటోకాల్ ప్రకారం నిపుణులైన వైద్యుల టీం తారకరత్నకు చికిత్స అందిస్తుందని వివరించారు.
తారకరత్నను పరామర్శించేందుకు ఈ సమయంలో ఎవరూ రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతీ క్షణం తారకరత్న ఆరోగ్య పరిస్థితి పైన నిపుణుల టీం అధ్యయనం చేస్తూ.. అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇది మరింతగా కొనసాగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. తమ ఆస్పత్రి వైద్యుల టీం పూర్తి స్థాయిలో చికిత్స కొనసాగిస్తోందని వివరించారు. ఆస్పత్రి వద్దే నందమూరి బాలయ్య ఉన్నారు. వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నారు. తారకరత్న సతీమణి తో పాటుగా ఇద్దరు కుమార్తెలు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సాయంత్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు బెంగుళూరులోని ఆస్పత్రిలో తారకరత్న పరామర్శం కోసం రానున్నారు.