
Gudivada Politics:కొడాలి నాని పై నందమూరి వారసుడు పోటీ - గుడివాడలో ఆట మొదలు..!!
రానున్న ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికారంలోకి రావటం చంద్రబాబు లక్ష్యం. అదే సమయంలో కొడాలి నాని పైన గన్నవరం లో గెలుపొందటం పార్టీకి అంతే ప్రతిష్ఠాత్మకం. దీని కోసం గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అక్కడ నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు న్టం చేసేదిగా గుర్తించారు. ఫలితంగా అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని నిర్ణయించారు. దీంతో, కొత్తగా నందమూరి వారసుడిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

కొడాలి నాని లక్ష్యంగా - ఓడించాల్సిందే
మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించటం ఈ సారి టీడీపీ ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ఇందు కోసం గుడివాడ కేంద్రంగా కొత్త నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలువురి అభ్యర్ధుల పేర్లు కొడాలి నాని మీద పోటీ చేస్తారంటూ ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ వారి పైన ఫీడ్ బ్యాక్ తీసుకొనే క్రమంలోనే ఈ పేర్లు తెర మీదకు వచ్చినట్లు మరో వాదన. అయితే, కొడాలి నాని పైన పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరిని దించినా..ఫలితం ఎలా ఉంటుందనే అంశంలో సందేహాలు నెలకొన్నాయి. ఒక దశలో మాజీ మంత్రి ఉమా పేరు తెర పైకి వచ్చింది. స్థానిక నేతలు ఎవరికి వారు తామే రానున్న ఎన్నికల్లో అభ్యర్ధులమని చెప్పకుంటున్నారు. కానీ, పార్టీ అధినేత ఆలోచన మాత్రం మరోలా ఉంది. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాలు...పార్టీ బలంతో వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే వారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నందమూరి కుటుంబం నుంచి గుడివాడ బరిలో..
కొడాలి నాని పలు సందర్భాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్.. నందమూరి కుటుంబం పైన తన అభిమానం చాటుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు - లోకేశ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తినే టీడీపీ నుంచి గుడివాడ బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కొడాలి నాని మద్దతు దారులుగా ఉన్న వారు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ గుడివాడలో తనను ఓడించేందుకు భారీ మొత్తం ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా నాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తుండటం.. లోకేశ్ మంగళగిరి ఖరారు కావటంతో, నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడిని ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నందమూరి కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

కొడాలి నానిపై నందమూరి చైతన్య కృష్ణ పోటీ
గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా నందమూరి చైతన్య కృష్ణ బరిలో దిగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ. కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో వైసీపీ నేతలు లక్ష్యంగా నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వల్లభేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబుకు హెచ్చరికలు చేసారు. తాజాగా సినీ రంగంలో ప్రవేశించిన చైతన్య కృష్ణ కు బాబాయ్ బాలయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. బసవతారకం క్రియేషన్స్ పతాకం పైన చైతన్య కృష్ణ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీంతో, నందమూరి వారసుడే గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే పార్టీ శ్రేణులంతా అక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కలిసి కట్టుగా పని చేస్తాయని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో, గుడివాడలో 2024 ఎన్నికల రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే ఉత్కంఠగా మారుతోంది.