పవన్ కళ్యాణ్పై దూకుడొద్దని బాబు, సరేనన్న కేశినేని: తగ్గిన నేతలు
హైదరాబాద్: జనసేన చీఫ్, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నట్లు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సంయమనం పాటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు. పవన్ కల్యాణ్పై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని తమ పార్టీ ఎంపీలకు తెలుగుదేశం పార్టీ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఆ పార్టీ ఎంపీలందరికీ రాష్ట్ర కార్యాలయం నుంచి దీనిపై ఫోన్లు వెళ్లాయి.
పవన్కు వ్యతిరేకంగా ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ అధినేత చంద్రబాబు అదేశించారని, దీనిని అందరూ పాటించాలని, ఎవరికీ ఏ మినహాయింపు లేదని, మీడియా ప్రతినిధులు అడిగినా దాటవేసి వెళ్లిపోవాలని, వివాదాన్ని పెంచవద్దని రాష్ట్ర కార్యాలయం వారికి సూచించింది.

ఎంపీ కేశినేని నాని తదితరుల వ్యాఖ్యలు వేడి రాజేసిన నేపథ్యంలో ఈ సూచన చేసింది. ఇది అనవసరపు వివాదమని, దీనిని పెంచరాదని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. నానికి కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈ విషయం తెలిపింది. పార్టీ ఆదేశాలను పాటిస్తానని, ఇక మాట్లాడబోనని ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు ఆదేశాల కారణంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడడం మానేసినట్లు చెబుతున్నారు. పైగా, పవన్ కళ్యాణ్ వాదలను కొన్నింటిని వ్యతిరేకిస్తూనే ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాజాగా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు - పవన్ కళ్యాణ్ను టిడిపి, బిజెపి కూటమి శ్రేయోభిలాషిగా అభివర్ణించారు.
కంభంపాటి రామ్మోహన్ రావు పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే రీతిలో బుధవారంనాడు స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలను వివాదం చేయాల్సిన పనిలేదని, ఆయన ఇప్పటికీ తమతోనే ఉన్నాడని ఆయన చెప్పారు. ఎంపీలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శలు చేయడం సరికాదని, ఎక్కే గడప.. దిగే గడప చందంగా ఏడాదిగా తాము కేంద్ర మంత్రుల్ని కలిశామని చెప్పారు.
చంద్రబాబు రాత్రనకా.. పగలనకా కష్టపడుతున్నారని, ఇదంతా తెలుగు ప్రజలు బాగుండాలనే తప్ప వ్యాపారాల కోసం కాదని చెప్పారు. ఏడాదిలో తాము చేసిన పనులన్నీ బహుశా పవన్కు తెలియకపోవచ్చునని అన్నారు. పవన్ సహా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, ఆయన కలిసి వస్తే పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. సగటున ప్రతి 4 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులను కలిశామని తెలిపారు.












Click it and Unblock the Notifications