గతం గతః- పొత్తుకు ఒప్పుకోండి- డజను ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మీకే: అమిత్ షాతో చంద్రబాబు
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు కూడా మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది. నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు.

అటు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన సంకేతాలను ఇచ్చారు పార్టీ క్యాడర్కు. ఏ క్షణమైన అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సి ఉంటుందనీ సూచించారు. ముందస్తు ఎన్నికల వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు హస్తిన పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. రాత్రి 8:30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఢిల్లీ మోతీ లాల్ నెహ్రూ మార్గ్లో ఉంటుందాయన నివాసం.
తొలుత చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ సాగింది. ముందస్తు ఎన్నికలతో పాటు ఏపీలో నెలకొన్న తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి బీజేపీతో కలిసి ముందుకెళ్లాలనే తన అభీష్టాన్ని చంద్రబాబు వారికి తెలిపారు.
తమతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో కలిసి రావడానికి అంగీకరించితే ఎనిమిది లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, కడప, రాజంపేట, కర్నూలు వంటి లోక్సభ స్థానాలు చంద్రబాబు ప్రతిపాదించిన జాబితాలో ఉన్నాయని అంటోన్నారు.
అదే సమయంలో ధర్మవరం, కదిరి, తిరుపతి, రాజమండ్రి సిటీ, గుంటూరు వెస్ట్, విశాఖపట్నం వెస్ట్.. వంటి అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణలో బేషరతుగా మద్దతు ఇస్తానని కూడా చంద్రబాబు ప్రతిపాదించారని చెబుతున్నారు. దీనిపై అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ టీడీపీతో పొత్తుపై అప్పటికప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications