బిజెపికి షాక్: టిడిపి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
సీమాంధ్రలో శనివారం నామినేషన్ల గడువు ముగిసింది. శనివారంనాడు పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కడప శాసనసభా నియోజకవర్గం నుంచి దుర్గాప్రసాద రావు టిడిపి బీ ఫారంతో నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై బిజెపి నాయుకుడ హరినాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తు ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించడమేనని ఆయన విమర్శించారు.
దుర్గాప్రసాద్ వెంటనే నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కాగా, సంతనూతలపాడు శాసనసభా నియోజకవర్గానికి విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ బీ ఫారంతో నామినేషన్ వేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లతో బిజెపి నాయకులు అయోమయంలో పడ్డారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది కదా అని ఓ వైపు అంటూనే మరోవైపు బిజెపి అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట్లనే నామినేషన్లు వేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. సీమాంధ్రలో బిజెపికి తెలుగుదేశం పార్టీ కేవలం 13 సీట్లు మాత్రమే కేటాయించింది. సీమాంధ్రలో మొత్తం 175 శాసనసభా స్థానాలున్నాయి.