దమ్ముంటే నా మీద దాడి చేయండి : వైయస్ కంటే జగన్ దారుణంగా..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!
ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద మండిపడ్డారు. కార్యకర్తల మీద దాడులు కొనసాగుతున్నాయని..తాము అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగ గలిగేవారా అని ప్రశ్నించారు. కార్యకర్తల మీద కాదని..దమ్ముంటే తన మీద దాడి చేయాలని సవాల్ చేసారు. వైయస్ కంటే జగన్ పాలన దారుణంగా ఉందని ఆరోపించారు. డీజీపీ..డీఐజీ మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులు బాద్యతగా వ్యవహరించాలని సూచించారు. జగన్ వంద రోజుల పాలనలో ఎక్కడ చూసిన అరచకాలే చోటు చేసుకుంటున్నాయంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ బాధితులు ప్రతీ ఒక్కరికీ టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.
కార్యకర్తలు కాదు..నా మీద దాడి చేయండి..
గుంటూరు జిల్లా పల్నాడు గ్రామాల్లో వైసీపీ బాధిత టీడీపీ మద్దతు దారుల కోసం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా ఒక శిబిరం ఏర్పాటు చేసారు. గ్రామాల్లో వారికి రక్షణ లేదనే కారణంగా వారికి టీడీపీ ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసింది. వారికి చంద్రబాబు భరోసా కల్పించారు. నియోజకవర్గాలు..మండలాల వారీగా బాధితులకు అన్ని ఏర్పాట్లు కల్పించారు. వారికి పార్టీ పరంగా..తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతీకార దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. 100 రోజులుగా ప్రజలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని విమర్శించారు. మంచి ఎవరు చెప్పినా ఈ ముఖ్యమంత్రి వినరని..మూర్ఖంగా ప్రజా వేదికను కూల్చివేసారని దుయ్య బట్టారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. నాడు వైయస్ కంటే ఇప్పుడు జగన్ పాలనలో అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కార్యకర్తలను తానే గ్రామాలకు తీసుకువెళ్తానని..వారికి ధైర్యం కల్పించేదుకు వారితో పాటుగా అక్కడే ఉంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ధైర్యం ఉంటే వైసీపీ నేతలు తన పైన దాడి చేయాలని చంద్రబాబు సవాల్ చేసారు. వారి కథ ఏంటో తాను చూస్తానని హెచ్చరించారు.
చంద్రబాబు సాధ్యం కాదన్నారు..సాధ్యం చేసి చూపిస్తన్న జగన్ : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసి సిబ్బంది..!!
ఏడుగురిని హత్య చేసారు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి చెందిన ఏడుగురిని హత్య చేసారని..22 మంది పైన భౌతిక దాడులకు దిగారని చంద్రబాబు లెక్కలు చెప్పారు. నేతలను నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందన్నారు. పోలీసులు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నేరుగా డీజీపీని ..ఐజీని కలిసినా గ్రామాల్లో బాధితులకు రక్షణ కల్పించలేరా అని చంద్రబాబు ప్రశ్నించారు. డీజీపీ అమెరికాలో ఉన్నారా..వీరేమైనా పై నుండి వచ్చారా అని నిలదీసారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారని.. మాజీ ఎమ్మెల్యేలను వేధిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. మరి కొందరి పైన ఎట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు పార్టీలకు అతీతంగా పని చేయాలని సూచించారు. తెలుగు దేశానికి ోటు వేసిందుకు గ్రామాలను ఖాళీ చేయమంటారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్యకర్తలను హద్దులో పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న సమయం లో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.
స్పందించని ప్రభుత్వం..
చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తూ..తమ కార్యకర్తలను హత్య చేస్తున్నారని..దాడులతో భయ పెడుతన్నారంటూ ఆరోపించినా మంత్రులు..పార్టీ నేతలు స్పందించలేదు. గతంలో ఇదే రకమైన ఆరోపణలు చంద్రబాబు చేసిన సమయంలో హోం మంత్రి సుచరిత వాటిని ఖండించారు. టీడీపీ శ్రేణుల మీద దాడులు జరగటం లేదని వివరణ ఇచ్చారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ వ్యవహారం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది.