అభ్యర్దుల ఖరారులో చంద్రబాబు కొత్త ఫార్ములా - కలిసొచ్చేనా..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. అధికారం నిలబెట్టుకోవాలనేది సీఎం జగన్ లక్ష్యం. టీడీపీకి ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారుతున్నాయి. జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ, ఇప్పుడు బీజేపీతోనూ దాదాపు ఖాయం చేసుకుంది. ఇటు టీడీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎవరు సీట్లు కోల్పోతారనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్దుల ప్రకటనకు సిద్దమయ్యారు.
సీట్ల కసరత్తు : టీడీపీ,జనసేనలో భాగంగా సీట్ల సర్దుబాటు పైన చంద్రబాబు, పవన్ ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల సర్దుబాట్ల పైన చర్చలు చేయాల్సి ఉంటుంది. బీజేపీ, జనసేన కలిపి 50 సీట్ల వరకు ఆశిస్తున్నాయి. 10 ఎంపీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు 35 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇందుకు బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారని చెబుతున్నారు. దీంతో, పొత్తు వేళ 40-45 సీట్ల వరకు మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం కనిపిస్తోందని టీడీపీలో చర్చ జరుగుతోంది. టీడీపీలో ఇప్పటికే ఇంఛార్జ్ లుగా 15-20 మంది వరకు సీట్లను మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

పొత్తుల లెక్కలు : ఇక, మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో మరో 40 స్థానాలు త్యాగం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో, చంద్రబాబు అనధికారికంగా సీట్ల పైన క్లారిటీ ఇస్తున్నారు. సీనియర్ల నుంచి తమతో పాటుగా తమ వారసులకు సీట్లు ఇవ్వాలని అభ్యర్దనలు వస్తున్నాయి. దీంతో, ఒక్కో ఫ్యామిలీకి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబా లకు ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారు. ఇటు సీట్ల మార్పు పైన సంకేతాలు ఇస్తున్నారు. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. పెడనలో పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ సీటు జనసేన కోరుతుండటంతో చర్చ జరుగుతోంది.

ఒకే సారి మొత్తం జాబితా : వైసీపీ నుంచి అభ్యర్దులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్దులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్దం కావటంతో... రెండు పార్టీల నుంచి మొత్తం 175 స్థానాలకు ఒకే సారి అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు బీజేపీతో పొత్తు చర్చలు..సీట్ల సర్దుబాటు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఆ తరువాతనే టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంతో పాటుగా మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల పైన క్లారిటీ రానుంది. దీంతో, ఇప్పుడు ఈ పొత్తుల చర్చలే కీలకంగా మారనున్నాయి. సోమవారం చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పొత్తుల పైన అధికారిక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications