అమిత్ షా అడిగింది ఇదే, త్యాగాలు తప్పవు - తేల్చేసిన చంద్రబాబు..!!
ఏపీలో పొత్త రాజకీయం కీలక దశకు చేరుకుంది. 2014 రాజకీయ పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు, అమిత్ షా చర్చల్లో టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం పైనే ప్రధానంగా చర్చ సాగింది. తమ ఇద్దరి మధ్య చర్చల సారాంశాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. అమిత్ షా ఏం ప్రతిపాదించారో చెప్పుకొచ్చారు. ఎన్డీఏలో చేరక తప్పదనే సంకేతాలు ఇచ్చారు. సీట్ల విషయంలోనూ దాదాపు నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు టీడీపీ ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది.
పొత్తుల లెక్కలు : ఏపీలో బీజేపీ ప్రస్తుతం మిత్రులుగా కొనసాగుతున్న టీడీపీ, జనసేనతో కలుస్తుందా లేదా అనే అంశం పైన క్రమేణా స్పష్టత వస్తోంది. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ భేటీలో జరిగిన చర్చల సారాంశం పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు పొత్తు ఖాయమైందనే సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏలో చేరాలని ఆహ్వానం అందిందని వెల్లడించారు. పార్టీ పరంగా ఉన్న పరిమితులు ..సమస్యల పైన చర్చించామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో చేరక తప్పదని పేర్కొన్నారు. ఎన్డీయేలో చేరితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తనకు అనిపిస్తోందన్నారు. ఒకరకంగా ఇది మనకు తప్పని పరిస్థితి అయిందని చంద్రబాబు వారితో చెప్పినట్లు సమాచారం.

ఎన్డీఏలోకి టీడీపీ : రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలు ఎక్కించడానికి కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్రం సహకరించకపోతే ప్రస్తుత సమస్యలను అధిగమించలేమని పేర్కొన్నారు. రాజధాని, పోలవరం వంటి నిర్మాణాల కోసం ఎన్డీఏలో చేరటం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసారు. కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఎన్డీఏలో చేరితే పార్టీకి, రాష్ట్రానికి మేలు జరుగుతుందనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో తమకు ఉన్న అవరోధాలు, సమస్యల గురించి అమిత్ షాతో చర్చించానని చంద్రబాబు తెలిపారు. మైనారిటీ వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవని, కానీ,..జగన్ పాలన చూసిన తర్వాత ఆ వర్గాల్లో గణనీయభాగం టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఇప్పుడు తాము ఎన్డీయేలో చేరితే వారు మళ్లీ వైసీపీ వైపు మళ్లుతారేమోనన్న అనుమానాలు ఉన్నాయని చెప్పినట్లు చంద్రబాబు వివరించారు.

సీట్ల లెక్క పై కసరత్తు : వైసీపీకి కేంద్రం మద్దతుగా ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉందనే విషయాన్ని తాను షా తో భేటీ వేళ ప్రస్తావించినట్లు వెల్లడించారు. దీని పైన స్పందించిన అమిత్ షా మైనారిటీ వర్గాలను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని, సరైన పద్ధతిలో వారికి మన ఆలోచనలను విశదీకరించగలిగితే ఆ వర్గాలను దరి చేర్చుకోవచ్చని షా అభిప్రాయపడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందన్న భరోసా ఇస్తామని కూడా చెప్పారని చంద్రబాబు వివరించారు. తాను తన పార్టీ నేతలతో మాట్లాడి అంతిమంగా పొత్తు, సీట్ల పైన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పినట్లు పార్టీ నేతలకు చంద్రబాబు వెల్లడించారు. అయితే, సీట్ల విషయంలో బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతిపాదన రావటంతో..ఇప్పుడు టీడీపీ నుంచి ఈ సీట్ల అంశం పైన కసరత్తు జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లోనే బీజేపీ-టీడీపీ పొత్తు పైన అధికారికం నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications