బీజేపీపై చంద్రబాబు ఆగ్రహం?
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. వచ్చేనెల 13వ తేదీన పోలింగ్ జరగబోతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తిచేశాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమని చంద్రబాబు భావించారు. పట్టువదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోగలిగారు. చిలకలూరిపేటలో జరిగిన బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని కూటమికి ఓట్లేయాలని అభ్యర్థించారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలెవరూ ఏపీవైపు తొంగి కూడా చూడలేదు.
రాష్ట్రంలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించారు. దీనివల్ల జనసేన పోటీచేయని స్థానాల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి సానుకూల నిర్ణయం రావడంలేదు. ఈ విషయంలో బీజేపీ ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి చేయడంలో విఫలమైందనే అభిప్రాయం కూటమి నేతల్లో నెలకొంది. జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 24 గంటల వ్యవధిలో ఎన్నికల కమిషన్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో బీజేపీ నుంచి సాయం అందుతుందని చంద్రబాబు, పవన్ మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. అయితే ఇంతవరకు వారు కోరుకున్న సాయమేదీ అందలేదు. అతి కష్టంమీద ఒకరిద్దరు అధికారులను బదిలీ చేశారు. తెలుగుదేశం, జనసేన మాత్రం చీఫ్ సెక్రటరీతోపాటు డీజీపీని మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. కాలయాపనే తప్ప అటువైపు నుంచి ఎటువంటి సహకారం అందడంలేదు. మే మొదటివారంలో భారీ బహిరంగసభలకు బీజేపీ నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. బీజేపీకి చెందిన అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభల్లో పాల్గొంటారని చంద్రబాబు, పవన్ భావించారు. కానీ అటువంటివేమీ జరగడంలేదు. జరుగుతున్న పరిణామాలన్నీ వైసీపీకి మేలు చేకూర్చేలా ఉన్నాయని టీడీపీ భావిస్తోంది. పొత్తు విషయంలో టీడీపీలోని ప్రత్యేక బృందం మథనపడుతోంది. బీజేపీ అగ్రనేతలు ఏపీ విషయంలో తమ ప్రాధాన్యాన్ని మార్చుకుంటారా? లేదంటే ఇదే పద్ధతిలో ముందుకు సాగుతారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications