వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చంద్రబాబు ప్రశంసలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. వైఎస్ కుమారుడు జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బాబు వైఎస్ను కొనియాడటం విశేషం. ''అమరావతి వివాదాలు - వాస్తవాలు'' పేరుతో రచయిత కందుల రమేష్ రచించిన పుస్తకావిష్కరణ విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్లో తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఏనాడూ ఆపేయాలనుకోలేదన్నారు. ఇలా ఎప్పుడైనా ఆపేయాలి అన్న చర్చ జరిగిందా? ఇక్కడే ఉన్న కన్నా లక్ష్మీనారాయణను అడిగానన్నారు. ఎప్పుడూ అలా చేయలేదని కన్నా చెప్పారు. ఎందుకంటే ఆయన వైఎస్ హయాంలో మంత్రిగా చేశారని చంద్రబాబు అన్నారు.

వైఎస్ కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలుకానీ నేను ప్రారంభించిన కార్యక్రమాలను నిలిపివేయాలి అనుకుంటే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందేది కాదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు కొత్తగా సైబరాబాద్ నిర్మించామని, దాన్ని అంతగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని నన్ను విమర్శించినవాళ్లూ ఉన్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదని, ఆ వ్యక్తి చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని, మనం చేసిన పరిపాలన వల్ల ప్రజలకు మంచి జరిగిందా? లేదా? అనేది చూడాలన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ హయాంలో భూములు సేకరించడం పూర్తయిందన్నారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్సార్ ఆ ప్రాజెక్టుకు భూమిపూజ చేసి పూర్తి చేశారని బాబు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications