పరిషత్ పోరుపై హైకోర్టు స్టేను స్వాగతించిన చంద్రబాబు-టీడీపీ నిర్ణయం సరైందేనంటూ
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఇవాళ ఇచ్చిన స్టే ఉత్తర్వులను టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. చట్ట విరుద్ధమైన ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం సరైందని కోర్టు తీర్పుతో రుజువైందని చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలను వెళ్లడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయమని చంద్రబాబు పేర్కొన్నారు.
పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని చంద్రబాబు తెలిపారు. ఈ చట్ట విరుద్ధ ఎన్నికలను బహిష్కరించడం సరైనదేనని మరోమారు రుజువైందన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం వీడి, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. న్యాయస్ధానాల మార్గదర్శకాలను ధిక్కరించే విధానాన్ని జగన్ రెడ్డి మానుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల కమీషనర్ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలి గాని రబ్బరు స్టాంప్ లాగా మారకూడదని చంద్రబాబు సూచించారు.. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటి పోయింది. కొత్తగా ఓటర్లు నమోదైన వారికి అవకాశం కల్పించే విధంగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. అప్రజాస్వామిక విధానాలతో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చిన నాయకులను ఎన్నుకునే విధంగా ఎన్నికలను నిర్వహించాలని చంద్రబాబు కోరారు.. ఎన్నికలను ఒక ఫార్స్ గా మార్చకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపాలని కోరారు.