వారంలో నిన్ను చంపేస్తా: మున్సిపల్ కమిషనర్కు టీడీపీ కౌన్సిలర్ వార్నింగ్!
నిన్ను వారంలో చంపేస్తానంటూ కమిషనర్ వెంకటశివారెడ్డిని టీడీపీ కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి బెదరించారు.
ప్రొద్దుటూరు: పెన్షన్ పంపిణీలో తలెత్తిన వివాదం టీడీపీ-వైసీపీ నేతల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డిపై జులుం ప్రదర్శించారు. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు.
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ వివాదానికి కారణమైంది. తను సూచించిన వ్యక్తులకు పెన్షన్ రాలేదన్న కారణంగా.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రామాంజనేయరెడ్డి అడ్డు తగిలారు. దీంతో పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన 60మంది వృద్ధులు ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న కమిషనర్ వెంకటశివారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న ప్రాథమిక పాఠశాల వద్దకు వెళ్లారు. రామాంజనేయరెడ్డికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు. కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని, సమస్య ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించినా.. వినలేదు సరి కదా రివర్స్ లో ఆయన పైనే రామాంజనేయరెడ్డి బెదిరింపులకు దిగారు.
నిన్ను వారంలో చంపేస్తానంటూ కమిషనర్ ను రామాంజనేయరెడ్డి బెదరించారు. దీంతో రామాంజనేయరెడ్డిపై త్రీటౌన్ పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేశారు. పోలీసులే వచ్చే లోపే కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి అక్కడినుంచి వెళ్లిపోవడంతో తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా, కేసును వెనక్కి తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ పై టీడీపీ నేతలు, మున్సిపల్ ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతున్నారు.