స్పీకర్ను అడ్డుకున్న టిడిపి: మార్షల్స్తో గెంటివేత
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెట్టినందుకు నిరసనగా తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛేంబర్ ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. శాసనసభలో బిల్లు ప్రతిపాదన తర్వాత వాయిదా పడిన తిరిగి సమావేశపరచడానికి స్పీకర్ బయలుదేరడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ్యులు స్పీకర్ను సభలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి తదితర మంత్రులు వారితో చర్చలు జరిపారు. అయినా తెలుగుదేశం సీమాంధ్ర సభ్యులు వినలేదు. స్పీకర్ శాసనసభ సమావేశం హాల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్తో టిడిపి సభ్యులను బయటకు పంపించారు. బిల్లుపై చర్చను వెంటనే ప్రారంభించాలని కోరుతూ పోటీగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ ఛేంబర్ వద్ద ధర్నాకు దిగారు.
ఆ తర్వాత శాసనసభ ప్రారంభమైంది. స్పీకర్ స్థానంలో ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఈ సమయంలో చర్చను ప్రారంభించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న ఉప సభాపతిని కోరారు.
కాగా, సభలో బిల్లును ప్రవేశపెట్టే అంశంపై బిఎసి సమావేశంలో ఇదివరకే నిర్ణయం జరిగిందని మంత్రి శ్రీధర్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనల మేరకే స్పీకర్ బిల్లు సభలో ప్రతిపాదించారని ఆయన చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నారు.