గౌరు దంపతుల చేరికపై గుర్రు మంటున్న కర్నూలు జిల్లా టీడీపీ నేతలు
కర్నూలు: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై విభేదాలు తలెత్తాయి. గౌరు దంపతుల చేరికను జిల్లాకు చెందిన మెజారిటీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చరితారెడ్డి చేరిక వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పార్టీకి ఏ రకంగా కూడా మేలు చేయదని జిల్లా టీడీపీ నాయకులు బాహటంగా విమర్శిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
గౌరు వెంకటరెడ్డిపై చంద్రబాబు ఘాటు విమర్శలు..
గౌరు చరితా రెడ్డి భర్త వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడు. విశ్వసనీయుడు. గౌరు వెంకట రెడ్డి జైలులో ఉండగా..ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ ఆయనను పలకరించి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, వైఎస్ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన వెంకటరెడ్డిని జైలు నుంచి బయటికి తీసుకుని రావడానికి వైఎస్ చేసిన కృషి చాలా ఉంది. ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో వైఎస్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారంటూ ఉద్యమాలు చేశారు. ఈ ఒక్క విషయంపైనే చంద్రబాబు అసెంబ్లీని స్తంభింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి వ్యక్తిని, కుటుంబాన్ని పార్టీలోకి తీసుకోవడంపై జిల్లా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమౌతోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తాము చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఉపయోగం లేదని అంటున్నారు. ఏది చేసైనా తాము ఎన్నికల్లో గెలవాల్సిందేనని చంద్రబాబు తమను ఆదేశిస్తున్నారని టీడీపీ నాయకులు వాపోతున్నారు.
ఏరాసు కూడా పార్టీ వీడుతారా?
గౌరు చరిత రాకను నిరసిస్తూ చల్లా రామకృష్ణా రెడ్డి ఇదివరకే రాజీనామా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. పాణ్యం టికెట్ ఆశిస్తోన్న మాజీమంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి కూడా ప్రస్తుతం సంకటస్థితిలో పడ్డారు. తనకు టికెట్ దక్కకపోతే పార్టీని వీడుతానని చంద్రబాబుకు సంకేతాలు ఇచ్చారట. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పాణ్యం నుంచి పోటీ చేసి, గౌరు చరిత మీద ఓడిపోయారు. ఇప్పుడు అదే చరితను తీసుకొచ్చి, గెలిపించాలని ఆదేశించడం పట్ల ఏరాసు కినుక వహించారు.