మెయిన్ లైన్లో నడవమంటే, లూప్ లైన్లోనే ప్రయాణం చేస్తానంటావేంటి
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య కుదిరిన సీట్ల పంపకాల వ్యవహారంపై చెలరేగిన దుమారం.. ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. రెండు పార్టీల్లో తీవ్ర అసమ్మతి చెలరేగింది. సీట్ల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక అసంతృప్త వాతావరణాన్ని రాజేసింది.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల సీనియర్ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటోన్నారు. సీనియర్ నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు. జనసేన బలంగా ఉందనుకుంటోన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పిస్తోన్నారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు. తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.
అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా ఏమీ లేకుండా టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సెటైర్లు వేశారు. ఏపీలో నెలకొన్న రాజకీయాలను చూస్తోంటే స్వర్ణకమలం సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తోందని పేర్కొన్నారు.
మెయిన్ లైన్ లో నడవమంటే, లూప్ లైన్ లోనే ప్రయాణం చేస్తానంటావేంటీ అంటూ తండ్రి.. తన కొడుకును అడుగుతాడని, ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ దురంధరులు తమ అనుభవం, దీర్ఘకాలిక ప్రణాళిక దృష్టిలో ఉంచుకొని పిలిచి ఇచ్చిన సలహాను విస్మరిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications