పొత్తుపై తేల్చేసిన పవన్, జగన్ కోరుకున్నట్లుగానే - ఢిల్లీ లెక్కే వేరు..!!
ఏపీలో ఎన్నికల పొత్తులపై స్పష్టత వచ్చింది. రాజమండ్రి జైలు బయట పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇంకా వారు ఏ నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. జగన్ ను ఓడించాలంటే కలిసి ఉండాల్సిందేనని సూచించారు. కానీ, బీజేపీ అందుకు సిద్దంగా ఉందా. జగన్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు పవన్ ఏకపక్షంగా చేసిన ప్రకటన పైన బీజేపీ ఏం చేయబోతోంది.
ఏపీలో పొత్తులు ఖరారు : ఏపీలో ఎన్నికల ఆట మొదలైంది. పొత్తులు ఇప్పటి వరకు ఖాయమని భావిస్తున్నట్లుగానే అఫీషియల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. చంద్రబాబును జైలులో పరామర్శించిన తరువాత పవన్ అధికారికంగా ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ తాను టీడీపీతో కలిసి వెళ్తున్నట్లు స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది చాలా రోజులుగా చంద్రబాబు, పవన్ ప్రయత్నం.

కానీ, బీజేపీ ఇప్పటి వరకు తేల్చేలేదు. అదే విషయాన్ని పవన్ అంగీకరించారు. కలిసి రావాలని మరో సారి అప్పీల్ చేసారు. కానీ, అది సాధ్యం కాదనేది పవన్ మాటల్లోనే స్పష్టం అయింది. ఏ మాత్రం ఆ దిశగా అవకాశం ఉంటే వేచి చూడటం..లేదా బీజేపీతో చర్చల తరువాత పొత్తు ప్రకటన చేసే వారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
జగన్ కు లాభమా నష్టమా : ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారంటూ టీడీపీ ముఖ్య నేతలే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు అందరికంటే ముందు వైసీపీనే చెబుతూ వచ్చింది. ఈ రెండు పార్టీల పొత్తు ఆకస్మికంగా వెల్లడైన విషయం కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏంటనేది కీలకంగా మారుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావటంతో పాటుగా..ఎన్నికల సమయంలో కొన్ని అంశాల్లో వారి పాత్ర ప్రధాన భూమికగా ఉంటుంది.
ఆ సమయంలో జగన్ కు అనుకూలంగా ఢిల్లీ నుంచి సహకారం ఉండకూడదనేది చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగానే టీడీపీ - బీజేపీ మధ్య పవన్ రాయబారం నడిపారు. కానీ, అక్కడ నుంచి ఇక సానుకూలత వచ్చే అంశం లేదనే అభిప్రాయానికి పవన్ - చంద్రబాబు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

బీజేపీ నిర్ణయం కీలకంగా : సీఎం జగన్ కోరుకున్నట్టుగానే రాజకీయ పరిణామలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు - పవన్ పొత్తును ఎదుర్కొనేందుకు జగన్ ఏడాదిన్నార కాలంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం అవసరం. అయితే, ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంట్ లో తీసుకొచ్చే బిల్లులు బీజేపీ నాయకత్వానికి ఎంత ముఖ్యమో..వాటి ఆమోదంలో జగన్ సహకారం అంతే అవసరం.
ఈ సమయంలో జగన్ వ్యతిరేకులకు బీజేపీ మద్దతుగా నిలిచే అవకాశం ఉండదనే అభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. అయినా, బీజేపీతో పొత్తు పైన పవన్ ఒక ఆప్షన్ ఓపెన్ గా ఉంచారు. బీజేపీ స్పందనకు అనుగుణంగా పవన్ ఎన్డీఏలో కొనసాగటమా, బయటకు రావటమా అనేది స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ నేరుగా చంద్రబాబును కలిసి పొత్తు ప్రకటించిన పవన్ విషయంలో బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications