వైసీపీలో చేరిన బొమ్మిరెడ్డి
నెల్లూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి కూడా ఫ్యాన్ గూటికి చేరారు. బొమ్మిరెడ్డి వెంట ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్ తోపాటు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఉన్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనరాయాణరెడ్డితోపాటు మరికొందరు నేతలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీచేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించినప్పటికీ ఇటీవలి పరిణామాల తర్వాత స్వతంత్రంగా కొనసాగుతూ వస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. వీరు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తుండటంతో వైసీపీ అధిష్టానం చురుగ్గా ఆలోచించి తెలుగుదేశం పార్టీలో ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పార్టీలోకి చేర్చుకుంది. జిల్లాలో బలం పెరిగిందనే భావనలో ఉన్న టీడీపీని బొమ్మిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంద్వారా మానసికంగా దెబ్బకొట్టినట్లైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది.













Click it and Unblock the Notifications