సీఐడీ ఎదుట హాజరైన దేవినేని ఉమ- జగన్పై షాకింగ్ కామెంట్స్- కేబినెట్ రద్దు అందుకే
ఏపీ సీఎం వైఎస్ జగన్ మార్ఫింగ్ వీడియోను విడుదల చేసిన కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఇవాళ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్డాడుతూ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ రద్దుకు కారణాలను ఆయన బయటపెట్టారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోలేక జగన్ పడుతున్న తిప్పల్ని దేవినేని ఉమ వెల్లడించారు.
సీఐడీ విచారణకు దేవినేని ఉమ
ఏపీ సీఎం వైఎస్ జగన్ అనని మాటల్ని అన్నారంటూ తయారు చేసిన వీడియోను విడుదల చేసిన వ్యవహారంలో ఏపీ సీఐడీ మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట దక్కలేదు. కేవలం అరెస్టు చేయకుండా మాత్రమే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
జగన్పై నిప్పులు చెరిగిన దేవినేని ఉమ
సీఐఢీ విచారణకు హాజరై బయటికి వచ్చిన తర్వాత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి తాను విచారణకు హాజరయ్యానని చెప్పిన ఉమ... సీఎం జగన్తో పాటు వైసీపీ సర్కార్పైనా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితిని ప్రస్తావిస్తూ జగన్ సర్కార్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై వ్యక్తిగతంగానూ విమర్శలకు దిగారు. ఏపీ కేబినెట్ భేటీ రద్దుకు కారణాలను సైతం దేవినేని వెల్లడించారు.
కేబినెట్ రద్దు వెనుక జగన్ భయం
ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ రద్దయింది. దీనికి కారణాలను సైతం ప్రభుత్వం వెల్లడించలేదు. దీంతో కేబినెట్ భేటీ రద్దుపై దేవినేని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్కు కరోనా భయమని, రెండు గంటలు కేబినెట్ మీటింగ్ కూర్చుంటే కరోనా వస్తుందేమోనని భయపడ్డారని వ్యాఖ్యానించారు. అందుకే కేబినెట్ను రద్దు చేశారని దేవినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్ దొరకని దారుణ పరిస్ధితుల ఉన్నాయని దేవినేని ఆరోపించారు.
మీకో న్యాయం విద్యార్దులకో న్యాయమా ?
కరోనా కారణంగా కేబినెట్ భేటీ రద్దు చేసుకున్న సీఎం జగన్ విద్యార్దుల విషయంలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పడంపైనా దేవినేని మండిపడ్డారు. మీకే అలా ఉంటే విద్యార్ధుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. కేంద్ర సంస్ధల కంటే నువ్వు తెలివైన వాడివా అని సీఎం జగన్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఓ కరోనా ఆస్పత్రిని సందర్శించే దమ్ముందా అని దేవినేని నిలదీశారు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి సీఎం ఎలా తాపత్రయపడుతున్నారో చూడండి అని దేవినేని అన్నారు.
Recommended Video
బతికున్నంతవరకూ ప్రశ్నిస్తూనే ఉంటా
బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛకు రాష్ట్రంలో ఏమాత్రం గౌరవం లేదని, ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా చేసుకుని పాలన సాగిస్తోందని ఉమ ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటని ఉమ ప్రశ్నించారు. గుజరాత్కి అమూల్ పాలు పోయించడానికి జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఇచ్చే దిక్కులేదని, పస్ట్వేవ్కీ, సెకండ్ వేవ్కీ మూడు నెలల టైం ఉంటే ఏం చేశారని దేవినేని ప్రశ్నించారు. దేవినేని ఉమ బతికున్నంతవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాడన్నారు.