ఇలాంటి చలివేంద్రం మీరెప్పుడు చూసి ఉండరు..
ఇప్పటిదాకా చలివేంద్రాలంటే మనకు గుర్తుకువచ్చేది.. రోడ్డు పక్కన తడికలతో మట్టి కుండల్లో నింపిన చల్లని నీటిని పంపిణీ చేసే దృశ్యం. అయినా చలివేంద్రాలంటే చల్లటి కుండ నీళ్లు గాక ఇంకేముంటుంది అనుకుంటున్నారా..! కానీ ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్పిందే. ఎందుకంటే ఈ చలివేంద్రంలో పంపిణీ చేసేది నీళ్లను కాదు.. చలువ చేసే తాటి ముంజలను.
నెల్లూరులో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం.. పట్టణంలో ఓ స్పెషల్ అట్రాక్షన్ కూడా అయిపోయింది. నెల్లూరు టీడీపీ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు ఈ సరికొత్త చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలో పడి వెళ్తున్నవారికి చలివేంద్రం ద్వారా తాటిముంజల్ని అందిస్తున్నారు. ఖరీదైన తాటిముంజల్ని ప్రజల కోసం ఉచితంగా పంపిణీ చేయడం మామూలు విషయమేమి కాదు. రోడ్డు వెంట నడుస్తూ వెళ్తున్నవారిని పిలిచి మరీ ముంజల్ని అందజేస్తున్నారు.
ఏదేమైనా.. గుక్కెడు మంచినీళ్ల కోసం అల్లాడుతున్న జనానికి తాటిముంజల్ని అందించడం అభినందించాల్సిన విషయమే అంటున్నారు నెల్లూరు జనం.