కామాంధుల్లా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు: కాటికి కాళ్లు చాపిన వయస్సులోనూ: నారా లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద ట్వీట్లు చేశారు. పోలీసుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయంటూ కొద్దిరోజులుగా విమర్శిస్తూ వస్తోన్న నారా లోకేష్- ఇదే అంశంపై అధికార పార్టీ నేతలపై ఘాటు ఆరోపణలను సంధించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు.
అమెరికా విమానం ఎక్కిన ప్రధాని మోడీ: విశేషాలను వెల్లడించి మరీ..!
విశాఖపట్నానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరావు ఓ దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని నారా లోకేష్ ఆరోపించారు. సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని అన్నారు. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులతోనే ఆమెను చిదిమేయడం ఘోరమని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతున్నారని, వారిని చూసి ఇతర నాయకులు కూడా నేర్చుకుంటున్నారని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతూంటే వైసీపీ నాయకులు తామేమి తక్కువ తినలేదంటూ అత్యాచారాలకు ఒడిగడుతున్నారని నారా లోకేష్ అన్నారు. కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడుతున్నారని మండిపడ్డారు. విశాఖకు చెందిన వైసీపీ నాయకుడు వెంకట్రావు.. కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులు ప్రజా ప్రతినిధులుగా పనికిరారని అన్నారు.
ఈ విషయంలో పోలీసులపైనా నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ రేపిస్టుల తరఫున పోలీసులు వకాల్తా పుచ్చుకుంటున్నారని ఆరోపించారు. చచ్చు మాటలు, పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు చేతనైతే, వారు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని అన్నారు.
విశాఖపట్నంలో దివ్యాంగురాలిపై వైసీపీ నాయకుడు వెంకట్రావు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ప్రస్తావించారు. వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద ఆరోపణలు గుప్పించారు. పోలీసుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.