భారత్ రక్షణ కవచంపైదుబాయ్ కన్ను  ! బ్రహ్మోస్, ఆకాశ్‌తీర్ కోసం యూఏఈ ఆరాటం..!

భారతదేశ రక్షణ రంగానికి అంతర్జాతీయంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ముప్పుల నేపథ్యంలో, అక్కడి కీలక దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) భారత్‌కు చెందిన అధునాతన రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణిగా పేరొందిన 'బ్రహ్మోస్' సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అలాగే వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 'ఆకాశ్‌తీర్' ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఈ రక్షణ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక స్థాయి చర్చలు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం అత్యంత వేగంగా పురోగమిస్తున్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ పై యూఏఈ కన్ను

మధ్యప్రాచ్యంలో మారుతున్న భద్రతా సమీకరణాలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూఏఈ తన రక్షణ సామర్థ్యాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని భావిస్తోంది. వైమానిక దాడులు, డ్రోన్లు మరియు క్షిపణి ముప్పుల నుండి కీలక ప్రాంతాలను రక్షించుకోవడంతో పాటు, చమురు ఎగుమతులకు మార్గమైన హార్ముజ్ జలసంధి భద్రతను బలోపేతం చేయడం యూఏఈ తక్షణ ప్రాధాన్యతగా మారింది. ఇందుకోసం రక్షణ వనరుల కొనుగోలులో కేవలం ఒక్క దేశంపైనే ఆధారపడకుండా, భారత్ వంటి మైత్రి దేశాలతో భాగస్వామ్యం వైపు మొగ్గు చూపుతోంది.

ప్రత్యేకతలివే

భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను భూమి, సముద్రం, వైమానిక మార్గాల ద్వారా శత్రువులపైకి అత్యంత వేగంగా ప్రయోగించవచ్చు. రష్యా దేశంతో యూఏఈకి ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాల కారణంగా ఈ క్షిపణుల ఎగుమతి ప్రక్రియకు ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఎదురుకావని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'ఆకాశ్‌తీర్' వ్యవస్థ శత్రు విమానాలు, డ్రోన్ల ఉనికిని యుద్ధరంగంలో వేగంగా పసిగట్టి, తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పెరుగుతున్న రక్షణ ఎగుమతులు

రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణల వల్ల భారత్ నుండి రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు తొలిసారిగా 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 37,868 కోట్లు) మైలురాయిని దాటడం గమనార్హం. గతంలో ఫిలిప్పీన్స్ దేశం భారత్ నుండి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయగా, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ తదితర దేశాలు కూడా వీటి పట్ల తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ ప్రతిపాదిత రక్షణ ఒప్పందం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే, గల్ఫ్ దేశాలలో భారతీయ రక్షణ సాంకేతికతకు మరింత గుర్తింపు లభిస్తుంది. అమెరికాకు చెందిన పేట్రియాట్, థాడ్ వంటి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న యూఏఈకి, భారత్ 'ఆకాశ్‌తీర్' సాంకేతికత మరింత రక్షణ కవచంలా ఉపయోగపడనుంది. ఈ అంతర్జాతీయ రక్షణ సహకారం భారత్-యూఏఈ సరికొత్త వ్యూహాత్మక మైత్రికి బలమైన పునాది వేయడమే కాకుండా, ప్రపంచ వేదికపై స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పరపతిని ఎంతగానో పెంచనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+