పెళ్లి కాని యువకులు ఊరిలో మద్యం తాగితే రూ. 5 వేలు జరిమానా..!
ఇటీవలి కాలంలో యువత తమ భవిష్యత్తును మరిచి మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా తదితర వాటికి బానిసలు అవుతున్నారు. దేశవ్యాప్తంగా యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా అడ్డ దారిలో డ్రగ్స్ సప్లై ఆగడం లేదు. యువత వాటికి బానిసై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య తమిళనాడులోని ఓ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తమిళనాడులోని విజుంతమావడి గ్రామం తీసుకున్న ఆదర్శవంతమైన నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.
తమిళనాడులోని విజుంతమావడి గ్రామంలో పెళ్లి కాని యువకులకు మద్యం విక్రయించడాన్ని నిషేధించారు అక్కడి పెద్దలు. ఈ రూల్స్ ను అతిక్రమిస్తే రూ. 5000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. పెళ్లి అయిన పురుషులు కూడా మద్యం తాగి ఇంట్లో కానీ వీధిలో కానీ ఎలాంటి గొడవలకు పాల్పడినా.. ఇతరులకు ఇబ్బంది కలిగించినా వారికి సైతం జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వినూత్న నిర్ణయం ద్వారా కుటుంబ భద్రత, ప్రజా భద్రత పెరుగుతోందని గ్రామంలోని కమ్యూనిటీ సభ్యులు.. సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి రూల్స్ ను పెడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
తమిళనాడులోని నాగపట్టిణం జిల్లా విజుంతమావడి గ్రామంలో ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయితీ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ఆగస్టు 2 నుంచి గ్రామంలో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం గ్రామ పరిసరాల్లో పెళ్లి కాని యువకులు మద్యం సేవించడం నిషేధం. ఎవరైనా ఈ రూల్ ను అతిక్రమించినట్లు తెలిస్తే రూ. 5వేలు జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే జరిమానా గ్రామంలోని పెళ్లి అయిన పురుషులకూ వర్తిస్తుంది. మద్యం సేవించి గ్రామంలో కానీ.. తమ ఇంట్లో కానీ ఎలాంటి గొడవలు సృష్టించడానికి వీలు లేదని గ్రామ పంచాయితీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

" ఈరోజు తీసుకున్న నిర్ణయం.. రేపటి భావితరానికి పునాది. మనమంతా మద్యాన్ని తొలగించి మన భవిష్యత్తును కాపాడుకుందాం. మన సమాజాన్ని రక్షించుకుందాం.." అని గ్రామంలో పోస్టర్లు, కట్ అవుట్స్ వెలిశాయి. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే దేశంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి రూల్స్ ను పెట్టారు. గతేడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 మతపరమైన ప్రాంతాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించింది. దాంతో ఇలాంటి నిర్ణయాలు దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో రావాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications