ఏపీలో డ్వాక్రా మహిళలకు పంద్రాగస్టు కానుక- మరో కొత్త పథకం..!
ఏపీలో డ్వాక్రా మహిళలపై కూటమి సర్కార్ (Ap govt) వరుసగా వరాలు కురిపిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఆర్దిక స్వావలంబన కోసం పలు కొత్త కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం.. ఇదే క్రమంలో స్త్రీనిధి పేరుతో మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మహిళల్ని ఉద్యోగాలు కోరుకునే స్దాయి నుంచి పారిశ్రామిక వేత్తలుగా మార్చే స్దాయికి తీసుకెళ్లడమే ఈ పథకం లక్ష్యమని చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
డ్వాక్రా మహిళలకోసం తీసుకొచ్చిన స్త్రీనిధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి PMFME పథకం కింద లభించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందిస్తారు.

ఈ పథకంలో మహిళలు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను జిల్లా రిసోర్స్ ఆర్గనైజేషన్ (DROs)గా పరిగణించి, వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం చేస్తారు. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మహిళలకు కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతం అయ్యే వరకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మహిళలు కూడా పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడంతో పాటు ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే ముఖ్యమంత్రి లక్షంలో ఇది భాగమన్నారు.














Click it and Unblock the Notifications