ఏపీలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్- ఇక 10 మంది అక్కర్లేదు..!
ఏపీలో స్వయం సహాయక సంఘాలకు కూటమి సర్కార్ (AP Govt) ఇవాళ మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాలకు ప్రయోజనాలు కల్పించేందుకు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇదే కోవలో ఇవాళ వారికి భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ డ్వాక్రా సంఘాలకు ఉన్న 10 మంది సభ్యుల నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది. ఇకపై 8 మంది ఉన్నా సరే వారికి రుణాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించబోతోంది.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపుల్లో సభ్యుల మరణం లేదా వలసల వల్ల ఒక సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే, ఆ సంఘాలు ఎంత బాగా పనిచేసినా తర్వాత రుణ సదుపాయం (రిపీట్ డోస్) పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏపీ గ్రామీణ బ్యాంక్ తమ అంతర్గత ఉత్తర్వులు నెంబర్ 152 ద్వారా దీనికి ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. ఇదో చారిత్రక నిర్ణయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం కనీసం 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్న సంఘాలకు రిపీట్ డోస్ రుణం మంజూరు చేస్తారని ఆయన తెలిపారు. అయితే సభ్యుల సంఖ్య తగ్గడానికి వలసలు లేదా మరణం మాత్రమే కారణమై ఉండడంతో పాటు, అక్రమాలు లేకుండా, పాత బకాయలు లేకుండా సక్రమమైన చెల్లింపులు ఉండాలన్నారు.

అర్హత గల స్వయం సహాయక సంఘాలు ప్రత్యేక తీర్మానం, బాధ్యతా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
రుణ సడలింపు పొందిన సంఘాలు 6 నెలల వ్యవధిలో తమ సభ్యుల సంఖ్యను మరల కనీసం 10 మందికి పెంచుకోవాలన్నారు. మహిళలకు ఇచ్చే రుణం ఒక ఆర్థికసాయం మాత్రమే కాదని, వారి జీవనోపాధి, స్వయం ఉపాధికి, మహిళల ఆర్థిక సాధికారతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇదే రీతిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC), రాష్ట్రంలో ఉన్న ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చి, మంచి రికార్డు ఉన్న స్వయం సహాయక సంఘాలకు 10 మంది నిబంధనను సడలించి, సులభంగా రుణ పునరుద్ధరణ సహాయం అందించాలని మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications