బోనాలు సమర్పించడంపై ట్రోలింగ్.. దిమ్మతిరిగేలా ఫరియా అబ్ధుల్లా కౌంటర్
సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచి విషయాలను కూడా చెడుగా చూస్తూ పిచ్చి రాతలు రాస్తూ స్టార్స్ను కొందరు ఇబ్బంది పెడుతున్నారు. కొందరు తారలు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తుండగా మరికొందరు మాత్రం నెటిజన్లకు కౌంటర్ ఇస్తున్నారు. చిన్నా చితకా నటీనటుల నుంచి సూపర్స్టార్స్ వరకు అంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాధితులే. తాజాగా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో బోనాల సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించారు. ఈ క్రమంలోనే సినీనటి ఫరియా అబ్ధుల్లా సైతం పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
సాంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. అయితే స్వతహాగా ముస్లిం అమ్మాయి అయిన ఫరియా.. హిందూ పండుగలలో పాల్గొనడంపై కొందరు తప్పుబట్టడంతో పాటు దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై అప్పుడే ఓ వీడియో విడుదల చేసి కన్నీటి పర్యంతమయ్యారు ఫరియా.. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఫరియా అబ్ధుల్లా మరోసారి నాటి ట్రోలింగ్పై స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తొలిసారిగా మెగాఫోన్ పెట్టి తెరకెక్కించిన మూవీ సిగ్మా.. సందీప్ కిషన్ ఇందులో హీరో. తెలుగు అమ్మాయి ఫరియా అబ్ధుల్లా ఆయన సరసన హీరోయిన్గా నటించారు. రాజు సుందరమ్, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థసన్, జాగ్ జాపీ, మగాలక్ష్మీ, షీలా రాజ్కుమార్, కిరణ్ కొండా తదితరులు కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్గా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు.
షెడ్యూల్ ప్రకారం జూలై 31న తెలుగు, తమిళ భాషల్లో సిగ్మా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సిగ్మా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే చెన్నైలో పలు ఈవెంట్స్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జేసన్ సంజయ్, సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లాలు హాజరై మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే మొన్న బోనాల టైంలో సోషల్ మీడియాలో కొంచెం ఇబ్బందిపడ్డారు. సోషల్ మీడియా వల్ల మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటీ? అని ఫరియా అబ్ధుల్లాను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారానే నేను కూడా నా అభిప్రాయాన్ని అప్పుడే తెలియజేశా. సోషల్ మీడియా మీద నాకు పెద్దగా ఓపీనియన్ లేదు.. అదొక ప్లాట్ఫాం అలానే ఉంటుంది. కానీ నాకు ఒకటి అనిపించింది.. మనమంతా 2026లో బతుకుతున్నాం.. కానీ మైండ్ సెట్ మాత్రం అక్కడే ఆ పాత రోజుల్లోనే ఉంది. ఆ రోజుల నుంచి కొన్ని ఓపీనియన్స్ వస్తున్నాయి.. కానీ నేను మాత్రం అడ్వాన్స్గా ఆలోచిస్తూ, అందరినీ ప్రేమించాలనే మైండ్ సెట్ నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరి నుంచి కూడా అలాంటి ప్రేమను కోరుకుంటాను.. కానీ అలా జరగలేదు. ప్రతి ఒక్కరికి ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. నా ఉద్దేశం వాళ్లకు నచ్చితే అలాగే ఫాలో అవుతారు అని ఫరియా అబ్ధుల్లా కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
