స్వాతంత్ర్య దినోత్సవం వేళ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రసంగం.. ఆ బాధ్యతలను గుర్తుచేస్తూ
కేంద్ర సహకారంతో, వికసిత్ భారత స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట్రం అన్ని విధాల ముందుకు వెళుతుంది అని అన్నారు.
బలమైన, సమర్థవంతమైన దేశంగా భారతదేశం
ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్రాన్ని కాపాడింది అన్నారు. బలమైన, సమర్థవంతమైన దేశంగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని కల్పిస్తున్నాం
అడవి తల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని కల్పిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. మారుమూల ప్రాంతాలలోని గిరిజనులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం పైన ప్రభుత్వం దృష్టి సారించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడుతూ పులివెందుల, డోన్ ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
వేగంగా రాజధాని అమరావతి, పోలవరం పనులు
రైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అటవీ భూములలో ఆక్రమణలను నిరోధిస్తున్నామని, ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్న ఆయన పోలవరం పైన ప్రత్యేక దృష్టి పెట్టామని, ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి అన్నారు.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలిపారు. 1000 కోట్లతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదే సమయంలో స్వేచ్ఛను ఇతరులను దూషించటానికి ఉపయోగించవద్దు అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి అన్నారు.
తప్పు జరిగితే దిద్దాలి కానీ వ్యవస్థనే ధ్వంసం చెయ్యొద్దు అని యువతకు హితవు
వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి తప్ప వ్యవస్థనే ధ్వంసం చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్రం మనకు హక్కులను మాత్రమే కాదు బాధ్యతలను కూడా ఇచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. స్వాతంత్రం మనకు ఇచ్చిన స్వేచ్ఛను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.












Click it and Unblock the Notifications