కుప్పంలో చంద్రబాబు రివర్స్ గేమ్, తోక ముడిచిన పెద్దిరెడ్డి బ్యాచ్, రాత్రి ఎమ్మెల్సీకి తడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో వైసీపీ నాయకులకు చుక్కలు చూపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబుపై పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భరత్ కు టీడీపీ నాయకులు సినిమా చూపించారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నచ్చచెప్పారు.
చంద్రబాబు సీఎం అయిన తరువాత కుప్పంలో అడుగుపెట్టడానికి వైసీపీ నాయకులు వెనకడుగువేశారు. చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, అంతేకాకుండా చిత్తూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయిన భరత్ గతంలో కుప్పంలోని టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భరత్ చాలా నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

చంద్రబాబు సీఎం అయిన తరువాత కుప్పం పరిసర ప్రాంతాల్లో కనపడకుండా భరత్ మాయం అయ్యాడు ఇటీవల తిరుపతిలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తాను కుప్పంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయినా భరత్ మాత్రం కుప్పం నియోజక వర్గంలో అడుగుపెట్టలేదు. ఇన్ని రోజుల తరువాత గురువారం రాత్రి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కుప్పం నియోజక వర్గంలోని రామకుప్పంలో ప్రత్యక్షం అయ్యాడు.
రామకుప్పం మండలంలోని వైసీపీ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డికి చెందిన అకందగానిపల్లిలోని గెస్ట్ హౌస్ లోకి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వెళ్లారు. తరువాత కుప్పం నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుతో భరత్ సమావేశం అయ్యారు. వైసీపీ నాయకులతో భరత్ మాట్లాడుతున్నాడని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ గెస్ట్ దగ్గరకు వెళ్లారు.

కుప్పంలో అడుగుపెట్టడానికి నీకు ఎంత ధైర్యం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, గతంలో మమ్మల్ని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటను పదేపదే అడ్డుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నీకు కుప్పంలో అడుగుపెట్టడానికి అర్హతలేదని టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సభను అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం తెలుసుకున్న సీఐ మల్లేష్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, చివరికి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించకుండా వైసీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారని, ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ నాయకులతో చర్చలు జరిపిన సీఐ మల్లేష్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తాను నచ్చ చెబుతానని, మీరు ఓపికగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు మనవి చేశారు. వైసీపీ నాయకుల సమావేశాన్ని అర్దాంతరంగా ముగించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్ మౌనంగా వెళ్లిపోయారు. గతంలో కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఎలా చుక్కలు చూపించారో అంతకంటే రెండింతలు ఆ పార్టీ నాయకులకు వైసీపీకి సినిమా చూపించడానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications