వైసీపీలో చేరిన కేశినేని నానికి ఊహించని షాక్!
తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎంపీ పదవికి తన రాజీనామాను ఆమోదించిన తర్వాత వైసీపీలో చేరతానని ప్రకటించిన కేశినేని నాని ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తనను చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తూ జిల్లాలో 60 శాతం టీడీపీని ఖాళీ చేయిస్తానని సవాల్ విసిరారు. నాని ఇలా ప్రకటించగానే జిల్లాలో ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్న నాయకులంతా తాము తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ కేశినేనికి షాక్ ఇచ్చారు.
జగన్ ఇంటి గడప తొక్కిన కేశినేని నానిని కలిసే ప్రసక్తే లేదని మైలవరం టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. తాను మొదటినుంచి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశానని, ఇప్పుడు కూడా అదేపని చేస్తానన్నారు. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్వి గన్నే నారాయణ ప్రసాద్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. తాము ఇప్పటివరకు ఎంపీ అనుచరులుగా ఉన్నప్పటికీ టీడీపీలోనే కొనసాగుతామని, వైసీపీలో చేరే ప్రసక్తే లేదని లోకేష్ కు స్పష్టం చేశారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎంకే బేగ్ తనయుడు ఎంఎస్ బేగ్ నియోజకవర్గ నాయకులతో కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిశారు. తాము టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బొమ్మసాని సుబ్బారావు, గన్నే నారాయణ ప్రసాద్, ఎంఎస్ బేగ్ టీడీపీలో కొనసాగుతామన్నారు. కేశినేనితో ఒకరిద్దరు మినహా ఎవరూ పార్టీని వీడే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications