టీడీపీ కడప ఎంపీ అభ్యర్దిగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ..!!
ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. కడప కేంద్రంగా జగన్ టార్గెట్ రాజకీయం నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసును ప్రతీ సభలో ప్రస్తావిస్తున్న చంద్రబాబు ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. వైఎస్ కుటుంబం నుంచి తమ పార్టీ అభ్యర్దిగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను బరిలకి దించాలని దాదాపు నిర్ణయించారు. దీని ద్వారా జగన్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
కడప రాజకీయం: టీడీపీ నేతలు వైఎస్ వివేకా హత్య అనంతర పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు ప్రతీ సభలోనూ వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. న్యాయం చేయమమని కోరుతున్న సునీతకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే సునీత కుటుంబానికి తమ పార్టీ నుంచి సీటు కేటాయించి..ఎన్నికల్లో పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కడప జిల్లాలోని కొందరు పార్టీ నేతల వద్ద ప్రాధమికంగా చర్చ చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీగా బరిలో నిలవటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాశ్ లక్ష్యంగా సునీత వరుస ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికల బరిలో సౌభాగ్యమ్మ: వివేకా సతీమణి సౌభాగ్యమ్మను అవినాశ్ రెడ్డిపై పోటీకి నిలిపితే మంచి ఫలితం ఉంటుందనే ప్రతిపాదన పైన చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. సౌభాగ్యమ్మను నిలపాలన్న ప్రతిపాదనను కొంత కాలం క్రితం వరకూ టీడీపీ నాయకత్వం అంత సీరియ్సగా తీసుకోలేదు. ఆ కుటుంబాల మధ్య వివాదంలో తాము జోక్యం చేసుకోరాదని అనుకొంది. కానీ, వివేకా హంతకులకు ప్రజాకోర్టులో అయినా శిక్ష పడాలని సునీత బహిరంగంగా విజ్ఞప్తి చేసిన తర్వాత వాతావరణం మారినట్లు కనిపిస్తోంది.
ఈ ప్రతిపాదనపై సునీత కుటుంబం స్పందన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ నాయకత్వం అధికారికంగా ఈ నిర్ణయం ఎక్కడా తెలియనప్పటికీ..అంతర్గతంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన పైన సునీత కుటుంబంతో చర్చల బాధ్యతలను సీనియర్లు అప్పగించినట్లు సమాచారం.
షర్మిల ఏం చేయబోతున్నారు: అటు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్దిగా సౌభాగ్యమ్మను పోటీలోకి దించితే షర్మిల నిర్ణయం కీలకం కానుంది. తన పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్దిని నిలబెడతారా..లేక, సౌభాగ్యమ్మకు మద్దతు ప్రకటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
వివేకా కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తారనేది కొంత కాలంగా ప్రచారం సాగుతున్నా..కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ నుంచి ప్రతిపాదన రావటంతో.. సునీత కుటుంబ సభ్యులు ఈ రెండు పార్టీల్లో ఎటువైపు మొగ్గు చూపుతారు..ఎవరెక్కడ పోటీలో నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications