లోకేశ్ జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు-పోలీసులకు టీడీపీ ఫిర్యాదు-గొడవలకే ఎంట్రీ ..
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధానికి తాజాగా నిన్న పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ మరోసారి వేదికైంది. ఈ మీటింగ్ లో అనుమతి లేకుండా ఎంటరైన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇతర నేతలపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు లోకేష్ గారు నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి చొరబడ్డారంటూ సిఐడి అడిషనల్ డీజీపీ కి టీడీపీ నేత వర్ల రామయ్య పిర్యాదు చేశారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారని, వేలాది మంది విద్యార్థులు పదిలో ఫెయిల్ అయి. తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫెయిల్ అయి బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్ధుల కుటుంబాలకు జూమ్ మీటింగ్ ద్వారా భరోసా కల్పించేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారని వర్ల తెలిపారు.
కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్లోకి చొరబడ్డారని వర్ల ఆరోపించారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీ లు మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారని, నేరపూరిత కుట్రతో, లోకేష్ గారి జూమ్ మీటింగ్ భగ్నం చేయాలని, రాజకీయ వైషమ్యాలు కల్పించాలని అక్రమంగా చొరబడ్డారని ఆరోపించారు.
Recommended Video
వల్లభనేని వంశీ, కొడాలి నాని తమ నాయకుడు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారని, వారి అక్రమ చొరబాటు భయాందోళన కల్గిస్తూ నేరపూరిత కుట్రగా కనిపిస్తున్నదని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూసిన అధికార వైసీపీ నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.