సాయిరెడ్డి ట్వీట్తో గంటా హర్ట్-నేడు స్పీకర్తో భేటీ-రాజీనామా ఆమోదం కోసం
ఏపీలో విశాఖ స్టీల్ ప్రైవటీకరణకు సాగుతున్న ఉద్యమం నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో ఉద్యమ సెగలు తమకు ఎక్కడ తగులుతున్నాయనే భయంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఛాంపియన్లుగా చెప్పుకుంటూ మైలేజ్ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ను తమ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ ప్రయత్నం బెడిసి కొట్టే సరికి గంటాపై విమర్శలు మొదలుపెట్టారు. దీంతో గంటా కౌంటర్ అటాక్కు సిద్దమయ్యారు.
వైజాగ్ స్టీల్ మంటలు
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు కలిసి కట్టుగా పోరాడాల్సిన ఏపీ రాజకీయ పార్టీలు ఎవరివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. విశాఖ స్టీల్ను కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు..ఇప్పుడు ప్రత్యర్ధులపై మాటల దాడిని తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కోసం తొలి రాజీనామా సమర్పించిన గంటా శ్రీనివాస్ను లక్ష్యంగా చేసుకుని ఉత్తుత్తి రాజీనామాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
సాయిరెడ్డి ట్వీట్పై గంటా మనస్తాపం ?
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమైన ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత ఆయనపై పెట్టిన ట్వీట్ సంచలనం రేపింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా? అంటూ సాయిరెడ్డి చేసిన ట్వీట్పై గంటా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.
రాజీనామాపై తాడోపేడో తేల్చుకోనున్న గంటా
ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కోసం తాను చేసిన రాజీనామా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు చేరింది. అయినా ఆయన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యమలో ఆయన హీరోగా నిలుస్తారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలకూ ఒత్తిడి పెరుగుతుంది. అంతిమంగా ఉపఎన్నికలు ఖాయమవుతాయి. దీంతో స్పీకర్ తమ్మినేని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజీనామాను వేళాకోళం చేయడంతో ఇప్పుడు దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు గంటా సిద్దమయ్యారు.
నేడు స్పీకర్ తమ్మినేనితో గంటా భేటీ
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పీకర్ తమ్మినేనిని వ్యక్తిగతంగా కలిసి కోరబోతున్నారు. ఇవాళ ఆయనకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చని గంటా చెప్తున్నారు. రాజీనామాల ద్వారానే రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. దీంతో స్పీకర్ ఫార్మాట్లోనే ఇచ్చిన తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ను గంటా కోరనున్నారు. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.